పరీక్షకు వెళుతూ.. మృత్యు ఒడికి | Bike And RTC Bus Dash Two Persons Killed While Going To Rayachoti | Sakshi
Sakshi News home page

పరీక్షకు వెళుతూ.. మృత్యు ఒడికి

Mar 22 2019 10:30 AM | Updated on Mar 22 2019 10:30 AM

Bike And RTC Bus Dash Two Persons Killed While Going To Rayachoti  - Sakshi

మృతి చెందినప ఓబుల్‌రెడ్డి, భార్గవి

సాక్షి, రాయచోటి టౌన్‌ : చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలోని మల్లూరమ్మ తిరునాలకోసం బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వల్లూరు మండలం నాగిరెడ్డి గారిపల్లెకు చెందిన ఎం. ఓబుల్‌రెడ్డి (48) గురువారం రాత్రి జరిగే తిరునాలకోసం బుధవారం మల్లూరుకు వచ్చారు. అదేరోజున తన తోడల్లుడి కుమార్తె భార్గవి, అల్లుడు మహేశ్వరరెడ్డి కూడా గుర్రంకొండ నుంచి వచ్చారు. భార్గవి డిగ్రీఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. గురువారం రాయచోటిలో పరీక్ష రాయాల్సి ఉంది.

దీంతో భార్గవి భర్త ద్విచక్రవాహనం కావాలని, తన భార్యను పరీక్షకు తీసుకెళ్లాలని మామ ఓబుల్‌రెడ్డిని అడిగారు. అయితే తనకు కూడా రాయచోటిలో పని ఉందని, పరీక్ష కేంద్రానికి నేను తీసుకెళతానని చెప్పి కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. రాయచోటి సమీపంలోని ఏజీ గార్డెన్‌ మలుపువద్దకు రాగానే కడప నుంచి బెంగళూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఓబుల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భార్గవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement