తూత్తుకుడిలో అదీబ్‌ | Ahmed Adeeb in Thoothukudi IB Custody Tamil nadu | Sakshi
Sakshi News home page

తూత్తుకుడిలో అదీబ్‌

Aug 2 2019 7:22 AM | Updated on Aug 2 2019 7:22 AM

Ahmed Adeeb in Thoothukudi IB Custody Tamil nadu - Sakshi

సాక్షి, చెన్నై : మాల్దీవుల మాజీ  ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అదీబ్‌ తూత్తుకుడి గుండా భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించారు. ఈ సమాచారంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని రాయబార, ఐబీ వర్గాలు విచారిస్తున్నాయి.

2015లో మాల్దీవుల ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన అహ్మద్‌ అదీబ్‌పై అక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయి. బాంబ్‌ పేలుళ్ల కేసులు కూడా ఉండడం, ఆయన్ను అరెస్టు చేసి, విడుదల కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో తూత్తుకుడి నుంచి ఈనెల 11న మాల్దీవులకు సరకుల లోడుతో ఓ నౌక వెళ్లింది. ఈనెల 27 ఆ నౌక అక్కడి నుంచి తిరుగు పయనం అయింది. ఇక్కడి నుంచి నౌక బయలు దేరిన క్రమంలో అందులో తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 8 మంది ఇండోనేషియాకు చెందిన వారు. ఒకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి. తిరుగు పయనంలో అదనంగా ఓ వ్యక్తి చేరడంతో తమిళనాడుకు చెందిన వ్యక్తికి అనుమానాలు రేకెత్తించాయి. తూత్తుకుడికి 30 నాటికన్‌ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో తమిళనాడు వ్యక్తి సంబంధిత తమ సంస్థకు సమాచారం అందించారు.

తిరుగు పయనంతో పది మంది వస్తున్నట్టుగా అతడు ఇచ్చిన సమాచారంతో ఇక్కడి పోలీసుల్ని అప్రమత్తం చేశారు. తూత్తుకుడి పోలీసులతో పాటు మెరైన్, కోస్టు గార్డ్‌ వర్గాలు అలర్ట్‌ అయ్యాయి. తూత్తుకుడికి 20 నాటికన్‌ మైళ్ల దూరంలో నౌక ఉండగా, దానిని చుట్టుముట్టారు. అందులో ఉన్న వ్యక్తి గురించి విచారించగా,  ఆయన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అహ్మద్‌ అదీబ్‌గా తేలింది.  ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా, భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఆయన్ను ఐబీ( ఇంటెలిజెన్స్‌ బ్యూరో) వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. తూత్తుకుడి ఓడరేవుకు చేరుకున్న అనంతరం రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. రాయబార కార్యాలయ వర్గాలు సైతం విచారణలో నిమగ్నం అయ్యాయి.  కాగా, అక్రమ చొరబాటు వెలుగులోకి రావడంతో తూత్తుకుడి మార్గం గుండా విదేశీ శక్తులు భారత్‌లోకి చొరబడే పరిస్థితులు ఉండడం భద్రతా పరంగా ఆందోళన కల్గిస్తున్నది. దీంతో స్థానిక పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరకుల గోడౌన్లు, అక్కడి సంస్థల మీద నిఘా పెంచారు.

Advertisement
 
Advertisement
Advertisement