నటి శ్రీరెడ్డిపై దాడి

Actress Sri Reddy attacked in chennai - Sakshi

నిర్మాత సహా ఇద్దరి అరెస్ట్‌

సాక్షి, చెన్నై: నటి శ్రీరెడ్డి, ఆమె మేనేజర్‌ మోహన్‌పై చెన్నైలో ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, హత్యా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వివరాలిలా ఉన్నాయి. చెన్నై వలసరవాక్కంలో నటి శ్రీరెడ్డి నివశిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి శ్రీరెడ్డి, ఆమె మేనేజర్‌ మోహన్‌పై దాడి చేశారు. దీనిపై ఆమె వెంటనే కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేయగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మద్యం మత్తులో గొడవ పడుతున్న ఫైనాన్షియర్, సినీ నిర్మాత సుబ్రమణి (40), అతని అక్క కుమారుడు గోపి (23)లను అరెస్ట్‌ చేశారు. దాడిలో స్వల్పంగా గాయపడిన శ్రీరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు.

శ్రీరెడ్డి ఫిర్యాదు మేరకు చెన్నై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు నిర్మాత సుబ్రమణి మూడునెలల క్రితం హైదరాబాద్‌లో శ్రీరెడ్డిని లైంగిక వేధింపులకు గురిచేయగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ పోలీసులు సుబ్రమణిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన సుబ్రమణి తన అక్క కుమారుడు గోపీని వెంటబెట్టుకుని వచ్చి శ్రీరెడ్డిపై దాడికి దిగారు. ఈ సంఘటనపై పోలీసులు శ్రీరెడ్డిని విచారిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top