ఏసీబీ వలలో ఆర్టీఏ అధికారి | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ఆర్టీఏ అధికారి

Published Sat, Dec 2 2017 3:20 AM

ACB raids on RTA officer house, over Rs.7 crores illegal accerts found - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/వరంగల్‌ క్రైం: రవాణాశాఖలో మరో అవినీతి అధికారి బాగోతం బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా పనిచేస్తున్న పైడిపాల రవీందర్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ల పై ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్‌ సహా ఐదు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టి రూ. 7 కోట్లకుపైగా విలువైన ఆస్తుల పత్రాలు, నగ దు, బంగారు అభరణాలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రవీందర్‌పై పీసీ యాక్ట్‌ 13 (1), రెడ్‌ విత్‌ 13 (2) కింద కేసులు నమోదు చేశారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 1981లో రోజువారీ వేతనంపై పనికి చేరిన రవీందర్‌ 1986లో ఇరిగేషన్‌శాఖలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదిం చారు. అయితే ఆ శాఖలో పరిమితికి మించి వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండటంతో ప్రభుత్వం ఆయన్ను 1999లో రవాణాశాఖకు బదిలీ చేసి జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమించింది. నాటి నుంచి పదోన్నతులు పొందుతూ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా పనిచేస్తున్నారు.

ఏసీబీ గుర్తించిన అక్రమాస్తుల వివరాలు...
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ హైదర్‌గూడలో రూ. 1.35 కోట్ల విలువైన నాలుగంతస్తుల భవనం.
హన్మకొండలో రూ. 11.26 లక్షలు, రూ. 12.56 లక్షల విలువైన రెండు జీ ప్లస్‌ వన్‌ ఇళ్లు.
హన్మకొండలోని పోచమ్మకుంటలో రూ. 8.7 లక్షల విలువైన 424 గజాల ఇంటి స్థలం.  
హన్మకొండలోని మరో ప్రాంతంలో రూ. 2.4 లక్షల విలువైన 200 గజాల ఇంటి స్థలం.
హన్మకొండలోని ఆటోనగర్‌లో రూ. 3.5 లక్షల విలువైన 119 గజాల ఇంటి స్థలం.
రూ. 5.5 లక్షల విలువైన మారుతీ ఎస్‌క్రాస్, ఆల్టో కార్లు.
రూ. 1.5 లక్షల విలువైన రెండు ద్విచక్ర వాహనాలు.
రూ. 15 లక్షల విలువైన బంగారం, ఇంట్లో రూ. 6 లక్షల నగదు.
బ్యాంకు ఖాతాలో రూ. 3 లక్షల నగదు, రూ. లక్ష విలువైన ఇన్సూరెన్స్‌ బాండ్‌. రూ. 5 లక్షల విలువైన గృహోపకరణాలు.

Advertisement
Advertisement