నేపాల్‌లో విషాదం.. 12 మంది మృతి

12 Migrant Workers Deceased In Road Accident On Nepal Highway - Sakshi

వలస కార్మికులను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

ఖాట్మండూ: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది వలస కార్మికులు మృత్యువాత పడగా.. 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నేపాల్‌లోని సల్యాన్‌ జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు ఉపాధి కోసం భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో గల బరేచ్‌ జిల్లాకు వలస వచ్చారు. కరోనా లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వీరంతా ఓ ప్రైవేటు వాహనంలో స్వస్థలానికి పయనమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి నేపాల్‌లోని బాంకే జిల్లా అడవి సమీపంలోకి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడిక్కడే మరణించారు.(కొత్త మ్యాప్‌పై నేపాల్‌ పార్లమెంటులో బిల్లు)

ఈ ఘటన గురించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ‘‘భారత్‌ నుంచి వస్తున్న వలస కార్మికుల వాహనం ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి సమయంలో యాక్సిడెంట్‌ జరిగింది. మృతదేహాలు, క్షతగాత్రులను నేపాల్‌గంజ్‌ సిటీలోని భేరి ఆస్పత్రికి తరలించాం. అతివేగం కారణంగా డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టినట్లు భావిస్తున్నాం. మృతుల్లో 11 మంది పురుషులు, ఒక స్త్రీ ఉన్నారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉంది’’అని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. భారత్‌ నుంచి వస్తున్న పౌరుల కారణంగానే నేపాల్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని.. భారత్‌ వైరస్‌ ప్రాణాంతకమైనదంటూ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.(భారత్‌పై నేపాల్‌ ప్రధాని షాకింగ్‌ కామెంట్లు!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top