భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభనష్టాలనుంచి మరింత పతనమైన సెన్సెక్స్ 38వేల దిగువకు చేరింది. లంచ్ అవర్ తరువాత మరింత క్షీణించాయి.సెన్సెక్స్ 444 పాయింట్లు కుప్పకూలి 37893 వద్దకు చేరింది. అలాగే 11400 స్థాయిని బ్రేక్ చేసిన నిఫ్టీ 11300 స్థాయిని కూడా బ్రేక్ చేసేందుకు సిద్దంగా ఉంది. 114పాయింట్లు నష్టపోయి 11305 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావు శాతమే వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలతో వారాంతంలో భారీ నష్టపోయిన సంగతి తెలిసిందే. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల్లో అమ్మకాలు కనొసాగుతున్నాయి. ప్రధానంగా బాడ్లోన్ల బెడదతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు భారీ నష్టాలతో రెండు నెలల కనిష్టానికి చేరింది.
రియల్టీ, బ్యాంక్స్ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రయివేట్ రంగ బ్యాంక్ కౌంటర్లలో ఆర్బీఎల్, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, డీసీబీ, కొటక్ మహీంద్రా, ఐడీఎఫ్సీ ఫస్ట్ నష్టపోతున్నాయి. రియల్టీ కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్, ఇండియాబుల్స్, సన్టెక్, ప్రెస్టేజ్, ఫీనిక్స్, బ్రిగేడ్, మహీంద్రా లైఫ్, శోభా నష్టాల్లో కొనసాగుతున్నాయి. యస్ బ్యాంకు, వేదాంతా, ఇండిగో సన్ఫర్మా లాభాల్లో కొనసాగుతున్నాయి.