
అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మంగళవారం స్టాక్ మార్కెట్ కుదేలైంది.
ముంబై : ఉత్పాదక రంగంలో మందగమనంతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. అమ్మకాల ఒత్తిడితో మంగళవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఐహెచ్ఎఫ్ఎల్లో అవకతవకలు జరిగాయనే అభియోగాలతో పాటు పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్లో సంక్షోభం తీవ్రమవడం మదుపుదారుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. యస్బ్యాంక్ షేర్లు ఏకంగా 24 శాతం మేర పతనమయ్యాయి. టెలికాం, రియల్టీ, ఐటీ సహా పలు రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 361 పాయింట్ల నష్టంతో 38,305 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో 11,359 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, టీసీఎస్ నష్టాలతో ముగిశాయి.