
పన్ను ఎగవేతల ‘ట్రేడింగ్’పై సెబీ కొరడా
పన్ను ఎగవేతకు స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన 22 ట్రేడింగ్ సభ్యులపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించింది.
22 బ్రోకింగ్ మెంబర్లపై వేటు
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతకు స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన 22 ట్రేడింగ్ సభ్యులపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించింది. సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాల నుంచి ఆయా సంస్థలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్యాష్ సెగ్మెం ట్లో తమ ప్రస్తుత క్లెయింట్ల తరఫున స్టాక్ బ్రోకర్లుగా కార్యకలాపాలు నిర్వహించడానికి ట్రేడింగ్ మెంబర్లను అనుమతిస్తున్నట్లు సెబీ తెలిపింది. కొత్త క్లెయింట్తో ఎటువంటి ఒప్పందానికీ రాకూడదని స్పష్టం చేసింది. ఇంతకుమించి సెక్యూరిటీస్ మార్కెట్లలో పరోక్షంగాకానీ, ప్రత్యక్షంగాకానీ ఈ సంస్థలు ఎటువంటి అమ్మకాలు, కొనుగోళ్లు జరపరాదని స్పష్టం చేసింది.
స్టాక్ ఆప్షన్స్ విభాగంలో వివాదాస్పద రూ.8,100 కోట్ల ట్రేడింగ్ లావాదేవీల ద్వారా భారీ మొత్తంలో పన్ను ఎగవేతలకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఈ బ్రోకింగ్ సంస్థలు ఎదుర్కొంటున్నాయి. ఆరోపణలు ప్రాథమికంగా నిర్ధారణ అయిన నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ ట్రేడింగ్ సభ్యులపై మరింత విచారణ జరిపి ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని సంబంధిత స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. సెబీ తాజా నిషేధిత జాబితాలో సన్స్టార్ సెక్యూరిటీస్, శుభ్ స్టాక్ బ్రోకింగ్ తదితర సంస్థలు ఉన్నాయి.