విదేశీ హోటళ్ల అమ్మకంపై సహారా కసరత్తు | Sahara in talks for sale of foreign hotels, 30 domestic assets | Sakshi
Sakshi News home page

విదేశీ హోటళ్ల అమ్మకంపై సహారా కసరత్తు

May 26 2017 12:23 AM | Updated on Sep 5 2017 11:59 AM

విదేశీ హోటళ్ల అమ్మకంపై సహారా కసరత్తు

విదేశీ హోటళ్ల అమ్మకంపై సహారా కసరత్తు

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్‌ .. విదేశాల్లో తమకున్న మూడు హోటల్స్‌ విక్రయంపై కసరత్తు చేస్తోంది.

దేశీయంగా 30 అసెట్స్‌ విక్రయంపైనా చర్చలు
న్యూఢిల్లీ/న్యూయార్క్‌: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్‌ .. విదేశాల్లో తమకున్న మూడు హోటల్స్‌ విక్రయంపై కసరత్తు చేస్తోంది. అలాగే దేశీయంగా 30 ప్రాపర్టీల అమ్మకానికి సంబంధించి రూ. 7,500 కోట్ల మేర వచ్చిన తుది బిడ్స్‌పై మదింపు జరుపుతోంది. 30 అసెట్స్‌ కోసం 250 పైగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) రాగా.. సుమారు 25–26 సంస్థలు తుది బిడ్లు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవోఐలు దాఖలు చేసిన సంస్థల్లో టాటా సంస్థలు, గోద్రెజ్, అదాని, పతంజలితో పాటు ఒమాక్సీ, ఎల్‌డెకో వంటి పలు రియల్‌ ఎస్టేట్‌ డెవలపింగ్‌ కంపెనీలు కూడా ఉన్నాయి.

మరోవైపు, న్యూయార్క్‌లోని ప్లాజా, డ్రీమ్‌ డౌన్‌టౌన్‌.. లండన్‌లోని గ్రాస్‌వీనర్‌ హౌస్‌ హోటల్స్‌ విక్రయానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ప్లాజా హోటల్లో సహారా వాటాలు కొనేందుకు యాష్‌కెన్జీ అక్విజిషన్‌ కార్పొరేషన్‌తో సౌదీ ప్రిన్స్‌ అల్‌–వలీద్‌ బిన్‌ తలాల్‌ చేతులు కలిపారు. సహారా గ్రూప్‌ సంస్థలు చట్టవిరుద్ధంగా రూ. 24,030 కోట్లు సమీకరించడం, వాటిని తిరిగి చెల్లించలేకపోయినందువల్ల గ్రూప్‌ అధిపతి సుబ్రతా రాయ్‌ సహారాను సుప్రీం కోర్టు జైలుకు పంపడం తెలిసిందే. ప్రస్తుతం పెరోల్‌ మీద బైటికొచ్చిన రాయ్‌.. జూన్‌ 15లోగా రూ. 1,500 కోట్లు కట్టకపోతే మళ్లీ జైలుకెళ్లాల్సి రానుంది. ఈ నేపథ్యంలో ఆస్తుల విక్రయంపై సహారా మరింతగా కసరత్తు చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement