సొంత పిల్లల్లా చూసుకోవాలి
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థినులను ఆయా వసతి గృహ సంక్షేమాధికారులు సొంత పిల్లల్లా చూసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి అన్నారు.
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థినులను ఆయా వసతి గృహ సంక్షేమాధికారులు సొంత పిల్లల్లా చూసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక బి.క్యాంప్లోని ఎస్సీ బాలుర వసతి గృహ సముదాయ ఆవరణలో జిల్లాలోని సాంఘిక సంక్షేమశాఖ కళాశాల, హైస్కూల్ స్థాయి ప్రత్యేక వసతి గృహాల సంక్షేమాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ వసతి గృహాల్లో 9, 10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో వార్డెన్లు స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నామా? విద్యార్థినులు సక్రమంగా కళాశాలకు వెళ్తున్నారా? తదితర విషయాలతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలనూ తెలుసుకోవాలన్నారు. సాధారణంగా ఈ వయస్సులోని విద్యార్థినులు తమ బాధలను ఇతరులతో చెప్పుకోలేక.. సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టపోతుంటారన్నారు. అందువల్ల వారి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ కుటుంబ విషయాలను కూడా చర్చించేలా సఖ్యత పెంపొందించుకోవాలన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థినులను పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేయాలన్నారు. ఇప్పటికే అన్ని కళాశాలల వసతి గృహాలకు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను పంపామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దిశానిర్దేశం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఇ.నాగభూషణం, సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, మోహన్రెడ్డి, జాకీర్ హుసేన్, సిద్ధరామయ్య, కళాశాల వసతిగృహ సంక్షేమాధికారులు మాధవేణి, గౌరి, హైస్కూల్ స్థాయి ప్రత్యేక హాస్టళ్ల సంక్షేమ అధికారులు లీలావతి, కల్పన, కరుణలత, అనిత తదితరులు పాల్గొన్నారు.