మైక్రోసాఫ్ట్ డిజిటల్ గవర్నెన్స్ టెక్ టూర్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ ఇండియా విజన్లో భాగంగా మైక్రోసాఫ్ట్ ఇండియా మంగళవారం డిజిటల్ గవర్నెన్స్ టెక్ టూర్ను ఆవిష్కరించింది. జాతీయస్థాయిలో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఐటీ విభాగాలకు ఇన్ఛార్జులుగా ఉన్న ప్రభుత్వాధికారులకు కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటెలిజెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్లో శిక్షణ ఇస్తారు. రానున్న 12 నెలల్లో 5,000 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో పలు వర్క్షాపులు ఉంటాయి. ఏఐని అందిపుచ్చుకునేందుకు, ఉత్పాదకతో కూడిన, పారదర్శక పాలన అందించేందుకు భద్రతతో కూడిన క్లౌడ్ టెక్నాలజీని ప్రభుత్వ సంస్థలకు మైక్రోసాఫ్ట్ అందించనుంది.
నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ఐటీ మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నీ ఢిల్లీలో డిజిటల్ గవర్నెన్స్ టెక్ సమిట్ 2019ను ప్రారంభించారు. దేశంలో సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ఎఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా ఎనలిటిక్స్ను కీలక రంగాల్లో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు