గ్యారేజీలో కారు బాగుచేస్తుండగా ప్రమాదవశాత్తూ జాకీ జారిపోవడంతో కారు మీదపడి ఒక యువకుడు మృతి చెందాడు.
వనస్థలిపురం (హైదరాబాద్) : గ్యారేజీలో కారు బాగుచేస్తుండగా ప్రమాదవశాత్తూ జాకీ జారిపోవడంతో కారు మీదపడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఉన్న ఆటోనగర్లో జరిగింది. వివరాల ప్రకారం... ఆటోనగర్లోని శ్రీసాయిరామ్ కారు రిపేరింగ్ షాపులో బోలెరో వాహనాన్ని లక్ష్మణ్(22) అనే మెకానిక్ రిపేర్ చేస్తున్నాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తు జాకీ జారిపోవడంతో బోలెరో వాహనం మీదపడి లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో యజమాని పరారయ్యాడు. విషయం తెలిసిన లక్ష్మణ్ బంధువులు షాప్ వద్దకు చేరుకొని అందులో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. మృతుడు హయత్నగర్ మండలం కుంట్లూరు గ్రామానికి చెందినవాడుగా సమాచారం. కాగా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.