
న్యూఢిల్లీ: జేకే లక్ష్మి సిమెంట్ క్యూ4లో రూ.34 కోట్ల (స్టాండెలోన్) నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 21 కోట్లతో పోలిస్తే ఇది 62 % అధికం. తాజాగా క్యూ4లో ఆదాయం రూ. 923 కోట్లు కాగా, గత క్యూ4లో రూ. 931 కోట్లు. గతేడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఆదాయాలను పోల్చి చూడటానికి లేదని సంస్థ తెలిపింది. 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై 0.75 పైసలు చొప్పున (15%) డివిడెండ్ చెల్లించాలంటూ కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.
కాగా పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జేకే లక్ష్మి సిమెంట్ నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 87 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు తగ్గింది. ఆదాయం మాత్రం రూ. 3,414 కోట్ల నుంచి రూ. 3,929 కోట్లకు పెరిగింది. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు 0.04% పెరిగి రూ. 383 వద్ద ముగిసింది.