రూపాయిపైనా కోవిడ్–19 ప్రభావం
ఒకేరోజు 24 పైసలు పతనం
71.56 వద్ద ముగింపు
ముంబై: భారత్ కరెన్సీ రూపాయిపైనా కోవిడ్–19 (కరోనా) వైరెస్ ప్రభావం కనిపిస్తోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం ఒకేరోజు 24 పైసలు పతనమయ్యింది. 71.56 వద్ద ముగిసింది. గడచిన మూడు వారాల్లో రూపాయి ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. చైనా కోవిడ్ భయాలు అంతర్జాతీయంగా కొనసాగుతుండడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి అంశాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
ట్రేడింగ్ మొదట్లో రూపాయి బలహీనంగానే 71.50 వద్ద ప్రారంభమైంది. 2018 అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. నిజానికి అంతర్జాతీయ క్రూడ్ ధరల పతనం రూపాయి విలువకు సానుకూలం కావాల్సి ఉంది. అయితే చైనా కరోనా వైరస్ ప్రభావం మొత్తంగా ప్రపంచ వృద్ధిపై పడుతుందన్న భయాలు, ఈక్విటీ మార్కెట్ల బలహీనత సంబంధిత అంశాలు రూపాయి తాజా పతనానికి కారణం అవుతుండడం గమనార్హం.