రుణమాఫీ కోసం వైఎస్ఆర్ సీపీ పోరుబాట
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రుణమాఫీ అమలు చేయాలనే డిమాండ్తో అక్టోబర్లో మండల, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం హామీ నెరవేర్చకపోతే వైఎస్ జగన్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నారు.
అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం పూర్తిచేయాలని, గ్రూప్లెవల్ నుంచి సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల తరువాత జరిగిన తొలి విస్తృత స్థాయి సమావేశం ఇదే.