
‘అలక నేతలకు చంద్రబాబు చెబుతున్నదదే’
వైఎస్ జగన్ను, తమ పార్టీని బలహీనం చేయాలని ఏపీ కేబినెట్ విస్తరణ చేసినట్టుందని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి అన్నారు.
విజయవాడ: వైఎస్ జగన్ను, తమ పార్టీని బలహీనం చేయాలని ఏపీ కేబినెట్ విస్తరణ చేసినట్టుందని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలకు మేలు చేసేందుకు కాదు, జగన్ ను టార్గెట్ చేసేందుకే మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించినట్టుగా ఉందని పేర్కొన్నారు. అలక వహించిన టీడీపీ నాయకులకు చంద్రబాబు అదే విషయాన్ని చెబుతున్నారని తెలిపారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణ జీర్ణించుకోలేక, ఏదోరకంగా దెబ్బ తీయాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా తమ అనుకూల మీడియాతో దాడి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మంత్రులుగా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించడం ప్రజాస్వామ్యబద్దమేనా అని పార్థసారధి ప్రశ్నించారు. గవర్నర్ ప్రమాణం చేయించింది టీడీపీ ఎమ్మెల్యేలతోనా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతోనా అని అడిగారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించే అవకాశం రాజ్యాంగంలో ఉందా అని నిలదీశారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంటే అడ్డుపడాల్సిన గవర్నర్ ఈవిధంగా చేయడం భావ్యం కాదన్నారు. ఈ మూడేళ్లు ప్రతిపక్షాన్ని, జగన్ మోహన్ రెడ్డిని బలహీనం చేయాలని ప్రభుత్వం పనిచేసిందని విమర్శించారు.