
అనంతపురం జిల్లా సీతారాంపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం : ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ గడిచిన 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న నేతన్నలకు సంఘీభావం తెలిపి, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం చేరుకున్నారు. మార్గం మధ్యంలోని సీతారాంపల్లి గ్రామంలో ఆయన స్థానిక రైతులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలలను పరిశీలించారు.
పంటనష్టంపై రైతుల నుంచి వివరాలను తెలుసుకున్న వైఎస్ జగన్.. ప్రభుత్వ తక్షణమే స్పందించి, రైతులను ఆదుకోవాలన్నారు. ‘‘అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలో కురిసిన వర్షాలకు సుమారు 50 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చిత్తూరులో 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకురావాలి. కానీ ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఆయన రైతులను గాలికొదిలేశారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.
దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్