‘అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా.. కనీసం ఎన్నికల ప్పుడు ఇచ్చిన ప్రధాన హామీలను కూడా నెరవేర్చలేకపోయాం.
సాక్షి, హైదరాబాద్: ‘అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా.. కనీసం ఎన్నికల ప్పుడు ఇచ్చిన ప్రధాన హామీలను కూడా నెరవేర్చలేకపోయాం. మరి ఏంచేశామని నవ నిర్మాణ దీక్ష చేపట్టగలం. ఆ పేరుతో సభలు, సమావేశాలు నిర్వహించగలం?’ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా జూన్ 2 నుంచి నవ నిర్మాణ దీక్ష పేరిట సభలు, సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ వర్గాల్లోనే అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీయే సరిగా అమలు చేయలేకపోయామని, రాష్ట్రంలో వ్యవసాయ రుణాలకు సంబంధించి కోటికి పైగా రైతుల ఖాతాలుంటే అందులో కనీసం సగం ఖాతాలకు కూడా మాఫీ కాలేదని నేతలు అంటున్నారు. రుణ మాఫీకి ఆధార్, సర్వే నంబర్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు వంటి పలు ఆంక్షలు విధించడంతో పాటు బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకున్న వారిని అరకొర మాఫీ నుంచి కూడా తప్పించడంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. రుణ మాఫీ అరకొరగానే జరిగిందనడానికి రైతుల నుంచి లక్షలాదిగా అందుతున్న ఫిర్యాదులే నిదర్శనమని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.