సేవలకు యూజర్ చార్జీలుండాలి | User charges for services | Sakshi
Sakshi News home page

సేవలకు యూజర్ చార్జీలుండాలి

Feb 3 2015 1:27 AM | Updated on May 29 2019 3:19 PM

కొత్తగా నిర్మించే రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ప్రతి సర్వీసుకూ యూజర్ చార్జీలు వసూలు చేయాలని సింగపూర్‌కు చెందిన ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ అధికారులకు పరోక్షంగా ఉద్బోధించింది.

  • ఏపీ అధికారులకు సింగపూర్ బృందం ఉద్బోధ
  • సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించే రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ప్రతి సర్వీసుకూ యూజర్ చార్జీలు వసూలు చేయాలని సింగపూర్‌కు చెందిన ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ అధికారులకు పరోక్షంగా ఉద్బోధించింది. సింగపూర్‌లో ప్రతి సర్వీసుకూ యూజర్ చార్జీలు వసూలు చేస్తారని.. ఆఖరుకు చెత్త ఎత్తివేయడానికి కూడా చార్జీలు ఉంటాయని వారు వివరించారు.

    ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశంపై సింగపూర్‌కు చెందిన లివెబుల్ సిటీస్, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థల ప్రతినిధి బృందం సోమవారం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులు, మునిసిపల్ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో నగరాల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణపై చర్చించారు.

    సింగపూర్‌లో వ్యర్థాలను తీసుకెళ్లే బాధ్యత 25 ఏళ్ల పాటు కాంట్రాక్టర్లకే అప్పజెబుతామని, ఇందులో ఐదేళ్లకొకసారి సమీక్ష నిర్వహించి రేట్లు పెంచుతామని, ఈ కాంట్రాక్టర్లే ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేస్తారని ఆ ప్రతినిధిలు వివరించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి రాజీపడబోమని, నిర్వహణకు తగ్గట్టు యూజర్ చార్జీల వసూళ్లు ఉంటాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement