ప్రతి సేవకూ యూజర్ చార్జీ | user charges for every service | Sakshi
Sakshi News home page

ప్రతి సేవకూ యూజర్ చార్జీ

Dec 21 2014 2:13 AM | Updated on Sep 2 2017 6:29 PM

నూతన రాజధానిలో యూజర్ చార్జీల మోత మోగనుంది.

 ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక సెస్

 సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానిలో యూజర్ చార్జీల మోత మోగనుంది. నూతన రాజధాని నిర్వహణ వ్యయం మొత్తాన్ని యూజర్ చార్జీల ద్వారా రాబట్టాలని నిర్ణయించారు. నూతన రాజధానిలో కల్పించిన అన్ని రకాల మౌలిక వసతులు, సేవలు వినియోగించుకునే వారందరి నుంచి యూజర్ చార్జీలను పూర్తి స్థాయిలో వసూలు చేయనున్నారు. నూతన రాజధానిలో కల్పించిన ఎటువంటి వసతులను వినియోగించుకున్నా వారినుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లులో పొందుపరిచారు. రాజధానిలో ప్రభుత్వ కల్పించిన వసతి, సేవలను వినియోగించుకునే వారిపై యూజర్ చార్జీలను వసూలు చేసే అధికారాన్ని ఏదైనా ఏజెన్సీకి గానీ వ్యక్తికి, ఏదైనా సంస్థ, అసోసియేషన్‌కు ప్రాధికార సంస్థ కమిషనర్ అప్పగించవచ్చునని బిల్లులో పేర్కొన్నారు. రాజధాని మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల అమలు కోసం నిర్దిష్ట సెస్‌ను విధించనున్నట్లు  స్పష్టం చేశారు. నూతన రాజధాని ప్రాంతంలో భూమి, భవనాలపై వినియోగ మార్పిడి ఫీజుతో పాటు అభివృద్ధి చార్జీలను ప్రాధికార సంస్థ విధించవచ్చు. ఇతర ఫీజులతో పాటు ల్యాండ్ పూలింగ్ పథకం లేదా పట్టణ ప్రణాళిక పథకం, లేదా నూతన రహదారి నిర్మాణం లేదా ఇతర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రభావిత ఫీజును అదనంగా వేసే అధికారాన్ని ఆ సంస్థకు  అప్పగించారు. నూతన రాజధానిలో ఏదైనా ప్లాటు లేదా భూమికి ఫీజులను గడువులోగా చెల్లించకపోతే అథారిటీ కమిషనర్ వసూలుకు చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.
 
 సంస్థ మూల ధనంగా రూ.1000 కోట్లు...
 
 రూ. 1000 కోట్ల మూల ధనంతో ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయనున్నారు. మరో రూ.250 కోట్లు చక్ర నిధి కింద కేటాయించినట్లు బిల్లులో స్పష్టం చేశారు. భూములు, భవనాలు విక్రయం ద్వారా వచ్చిన నిధులను అలాగే స్థిరాస్తి, చరాస్తి, ఇతర ఆస్తులు విక్రయం ద్వారా వచ్చిన నిధులను.. యూజర్ చార్జీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థల ద్వారా చేసిన అప్పులను రాజధాని ప్రాంత అభివృద్ధి నిధికి జమ చేయనున్నారు.
 
 పలు అవసరాల కోసం ఎస్‌పీవీ
 
 నూతన రాజధానిలో పలు అవసరాల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ప్రభుత్వ అనుమతితో అథారిటీ ఏర్పాటు చేసుకోవచ్చు. స్పెషల్ పర్పస్ వెహికల్‌లో ప్రభుత్వ ప్రతినిధి ఉంటారని తెలిపారు. ఈక్విటీ గానీ రుణం విషయంలో గానీ ప్రభుత్వ ప్రతినిధి పర్యవేక్షిస్తారని బిల్లులో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement