వ్యవసాయశాఖలో అయోమయపరిస్థితి నెలకొంది. ఆశాఖను నడిపించే రథసారథిగా ఎవరిని నియమిస్తారో ప్రభుత్వం తేల్చకపోవడంతో ఆ శాఖ ఉద్యోగులు
విజయనగరంఫోర్ట్: వ్యవసాయశాఖలో అయోమయపరిస్థితి నెలకొంది. ఆశాఖను నడిపించే రథసారథిగా ఎవరిని నియమిస్తారో ప్రభుత్వం తేల్చకపోవడంతో ఆ శాఖ ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. తాము ఎవరికింద పనిచేయాలో తెలియక సతమతవుతున్నారు. ఒకరు బదిలీ అయిన జాయింట్ డెరైక్టర్ మరొకరు జేడీగా పదోన్నతి బదిలీపై వచ్చినవారు. ఇక్కడ పనిచేసిన వ్యవసాయశాఖ జేడీ డి.ప్రమీలను శ్రీకాకుళం ఆత్మ ప్రాజెక్టు డెరైక్టర్గా ఆశాఖ కమిషనర్ బదిలీ చేస్తూ గత నెల5వతేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జేడీ బదిలీల్లో ఆక్రమాలు జరిగాయని తమకు అన్యాయం జరిగిందని 13 జిల్లాలకు చెందిన జేడీలు పోరాటా లు చేస్తున్నారు.
అయితే అధికశాతంమంది జేడీలు సెలవు పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. బదిలీ అయినప్పటికీ విజయనగరం జేడీ ప్రమీల ఇంకా కొనసాగుతున్నారు. అయితే విశాఖపట్నంలో ఆత్మ డీపీడీగా పనిచేసిన జె.ఎస్.ఎన్ లీలావతికి ఇక్కడికి బదిలీ అయింది. ప్రమీలకు బదిలీ అవడంతో పూర్తిఅదనపు బాధ్యతలు కల్పిస్తూ జేడీగా లీలావతికి బాధ్యతలు అప్పగిస్తూ ఆశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె ప్రమీల రిలీవ్ అయితే జేడీ బాధ్యతలు స్వీకరించాలని భావిస్తూ ప్రస్తుతానికి డీడీగా బాధ్యతలు స్వీకరించారు.
ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక సిబ్బంది అవస్థలు
బదిలీ అయినప్పటికి ఇంకా ప్రమీల జేడీ గా కొనసాగుతున్నారు. ఎప్పటి మాదిరి గా ఆమె ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. మరో వైపు బదిలీపై వచ్చిన లీలావతి చెప్పిన పనిచేయకపోతే ఆమె జేడీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనసులో పెట్టుకుని ఇబ్బంది పెడతారేమోనని ఉద్యోగులు లోలోన మధనపడుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఉద్యోగులైతే మాశాఖలో అయోమయ పరిస్థితి ఉందని బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ అయోమయ పరిస్థితికిప్రభుత్వం తెరదించుతుందో, కొనసాగిస్తుందో వేచి చూడాలి.