సిబ్బంది 40 మంది ఉంటే.. రోగులు 30 మందే ఉన్నారు... ఇంత పెద్దాసుపత్రిలో ఇదేమి పరిస్థితి అని వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ కనక దుర్గమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పులివెందుల అర్బన్ : సిబ్బంది 40 మంది ఉంటే.. రోగులు 30 మందే ఉన్నారు... ఇంత పెద్దాసుపత్రిలో ఇదేమి పరిస్థితి అని వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ కనక దుర్గమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత సిబ్బంది ఇక్కడ అవసరం లేదన్నారు. పని ఉన్నచోటకు వారిని మార్చాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. ఆస్పత్రి ఇంత అధ్వాన్నంగా ఉంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రోగులకు అందించే భోజనం సరిగా లేదనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. రికార్డులు తప్పుల తడకడగా ఉన్నాయన్నారు. కళ్లు మూసుకుని రికార్డులు రాస్తున్నారా అంటూ మండిపడ్డారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామన్నారు. ఆస్పత్రికి సంబంధించి రూ. 3 లక్షల నిధులు ఉన్నట్లు రికార్డులలో ఉన్నా... నిధులు లేవని చెప్పడంతో సూపరింటెండెంట్పై మండిపడ్డారు. మీరు డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా అని ప్రశ్నించారు. పనితీరును మార్చుకోకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రామ్మోహన్, సూపరింటెండెంటు ప్రసాద్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.