ఈసారీ ఆలస్యమే

Textbooks Distributions Delyed This Educational Year - Sakshi

ఇంకా ప్రారంభమే కాని పుస్తకాల ముద్రణ

ఇండెంట్‌పై స్పష్టత లేని విద్యాశాఖ

డైట్‌ లెక్కల మేరకే ముద్రణ

విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలనీ తెలుసు. అయినా పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడంలో ఏటా సర్కారు విఫలమవుతోంది. ఇది విద్యార్థులకు శాపంగా మారుతోంది. సర్కారు పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏటారూ.కోట్లు వెచ్చిస్తున్నా, వాటిని సకాలంలో అందుబాటులోకితీసుకురావడం లేదు. ఈ ఏడాది అదే పరిస్థితినెలకొననున్నదన్న విసయం స్పష్టమవుతోంది.

సాక్షి, తిరుపతి:ప్రైవేటు పాఠశాలల కంటే ఒకడుగు ముందుగా ఉండాల్సిన సర్కారు బడులు వెనకడుగు వేస్తున్నాయి. ఓ వైపు ప్రైవేటు పాఠశాలలు సెలవుల్లోనూ గప్‌చిప్‌గా తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్టు వారు ముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించారు. అయితే సర్కారు మాత్రం పాఠాలు నేర్వలేకపోతోంది. మరో నెల రోజుల్లో బడులు తెరవనున్నా... ఇంత వరకు పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమే కాలేదు. అందుకు అవసరమైన ఇండెంట్‌ కూడా క్షేత్రస్థాయి నుంచి విద్యాశాఖకు అందలేదని విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ సారి పాఠ్యపుస్తకాలు సమయానికి అందే అవకాశాలు లేవని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇండెంట్‌పై స్పష్టత లేదు
జిల్లాలోని ప్రతి పాఠశాలల నుంచి ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమనే వివరాలను మండల విద్యాశాఖ అధికారులు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ మార్చి నెలలోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియకు స్వస్తి పలికినట్లు ప్రచారం జరుగుతోంది. అలా సేకరించిన వివరాలను మండలాల నుంచి జిల్లాలకు, అక్కడ నుంచి రాష్ట్రా ఉన్నతాధికారులకు పుస్తకాల ఇండెంట్‌ పంపాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయి నుంచి పాఠ్యపుస్తకాల ఇండెంట్‌ విద్యాశాఖ సేకరించలేదని తెలిసింది. కేవలం డైట్‌ లెక్కల ప్రకారమే పాఠ్యపుస్తకాలను ముద్రించటానికి విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గత ఏడాది ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో 2.50 లక్షలు మిగులు ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చెబుతున్న మాట. మిగులు పోను 19.50 లక్షల పాఠ్యపుస్తకాలు ముద్రించి పంపుతామని జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే జిల్లా అధికారులు మాత్రం తమ వద్ద మిగులు పుస్తకాలు లేవని చెబుతున్నారు. అయితే రాష్ట్ర, జిల్లా అధికారుల మధ్య ఈ లెక్కలు తేలాల్సి ఉంది. 

ముద్రణ ఎప్పుడు..పుస్తకాలు చేరేదెప్పుడు?
గత ఏడాది ఏప్రిల్‌లోనే పుస్తకాల ముద్రణ పూర్తి చేశారు. ఆ పుస్తకాలు జిల్లాకు చేరి, అక్కడి నుంచి మండలాలకు, గ్రామాలకు చేరటానికే ఆలస్యమైంది. గత ఏడాది పాఠశాలలు పునఃప్రాంభమైనా సమయానికి పుస్తకాలు అందించలేకపోయా రు. అయితే ఈ ఏడు ఇంకా పుస్తకాల ముద్రణే ప్రారంభం కాలేదంటే... పరిస్థితి అర్థం చేసుకోవ చ్చు. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభమైలే... జూలైలో కాని పుస్తకాలు అందే అవకాశాలు లేవని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వారంలో టెండర్లు పిలుస్తాం
పాఠ్యపుస్తకాల పంపిణీకి సంబంధించి మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. డైట్‌ లెక్కల ప్రకారమే పాఠ్యపుస్తకాల ముద్రణ జరుగుతుంది. పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నారా? లేదా? అనే విషయంపై మా వద్ద స్పష్టమైన సమాచారం లేదు. – పాండురంగ స్వామి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top