
సాక్షి, వేంపల్లి : ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వేంపల్లిలో ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం గురించి ఉపాధ్యాయులు ఈ సందర్భంగా వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించారు. నిన్నటి సభలో పెన్షన్ స్కీంపై ప్రతిపక్షనేత ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాత పద్థతిలోనే పెన్షన్ స్కీం కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని వైఎస్ జగన్ ...ఉపాధ్యాయ సంఘాల నేతలకు తెలిపారు. అలాగే విద్యారంగ సమస్యలపైనా దృష్టి పెడతామని ఆయన హామీ ఇచ్చారు. పాఠశాలల్లో వసతులు, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి పెడతామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
కాగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీ తమలో భరోసా నింపిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టమని తాము కోరినట్లు చెప్పారు. ఇచ్చిన హామీని అమలు చేస్తే లక్ష 80వేలమంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందన్నారు. జరగబోయే ఎన్నికల్లో తాము వైఎస్ జగన్ వెంటే ఉంటామని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాల నేతల ఆశాభావం వ్యక్తం చేశారు.