
వృద్ధి రేటు 11.72 శాతం: సీఎం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్రం 11.72 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే రెట్టింపుగా ఉండటం విశేషమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
శుక్రవారం సచివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన కార్యదర్శులు, శాఖాధిపతుల సదస్సుల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ శాఖ అనుసరిస్తున్న విధానాలను విశ్లేషించుకుని ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. తొలి త్రైమాసికంలో సాధించిన 11.72 శాతం వృద్ధిలో 40 శాతం వాటా ఫిషరీస్ రంగానిదే కావటంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణపై మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, ఫిషరీస్ కమిషనర్ శంకర్ నాయక్తో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను సీఎం గుర్తు చేశారు.