బెల్లం రైతులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే చెరకు పంటకు నష్టం వాటిల్లి దిగుబడిపరంగా చతికిలపడ్డ రైతులకు అటు కర్మాగారాలందించే మద్దతు ధర నిరాశ పరుస్తోంది.
=బెల్లం మార్కెట్లో భిన్న పరిస్థితి
=భారీగా లావాదేవీలు
=రేటు తగ్గి వ్యాపారవర్గాలు కుదేలు
అనకాపల్లి,న్యూస్లైన్ : బెల్లం రైతులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే చెరకు పంటకు నష్టం వాటిల్లి దిగుబడిపరంగా చతికిలపడ్డ రైతులకు అటు కర్మాగారాలందించే మద్దతు ధర నిరాశ పరుస్తోంది. ఇటు జాతీయస్థాయిలో పేరొందిన అనకాపల్లి మార్కెట్లో ధరలు ఊహించని స్థాయిలో పడిపోతున్నాయి. సోమవారం అనకాపల్లి మార్కెట్లో కనిపించిన స్థితిగతులే దీనికి అద్దంపడుతున్నాయి.
ఈ సీజన్లోనే అత్యధిక బెల్లం దిమ్మలు వచ్చిన రోజుగా సోమవారం నమోదయింది. అదే సమయంలో మొదటిరకం బెల్లం ధరలు మూడువేలు లోపు పడిపోవడం మార్కెట్ వర్గాలను కుంగదీసింది. మార్కెట్కు 16,355 దిమ్మలు రాగా, మొదటిరకం అత్యధికంగా క్వింటాల్కు రూ. 2960, మూడో రకం క్వింటాల్ అత్యల్పంగా రూ. 2480 పలికింది. శనివారం మార్కెట్కు 8810 దిమ్మలు రాగా మొదటి రకం ధర గరిష్టంగా రూ. 3170, మూడో రకం కనిష్ట ధర రూ. 2630 నమోదయ్యాయి.
రెండు రోజుల వ్యవధిలో మొదటిరకం రూ. 210 కోల్పోగా మూడో రకం రూ. 150 తగ్గిపోయింది. లావాదేవీలు పెరిగినందుకు సంతోషపడాలో, ధరలు తగ్గిపోయినందుకు బాధపడాలో అర్ధం కాక మార్కెట్ వర్గాలు సతమతమయ్యాయి.