పూటకో మాట.. రోజుకో వేషం.. బాబు నైజం!

Shilpa Chakrapani reddy Fires On CM Chandrababu - Sakshi

బొమ్మలసత్రం: తెలంగాణలో అమ్ముడుపోయిన నేతలు సంతలో పశువులంటూ చంద్రబాబు చెబుతున్నారని, ఆంధ్రాలో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ఆయనే కొనుగోలు చేశారని, మరి ఇక్కడ అమ్ముడుపోయిన వారినేమనాలో ఆయనే చెప్పాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీæ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పూటకోమాట, రోజుకొక వేషం వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం నంద్యాలలోని ఆయన నివాసంలో వైఎస్సార్‌సీపీ బీసీసెల్‌ రాష్ట్రప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్‌ నాయుడు ఆధ్వర్యంలో 2019 క్యాలెండర్‌ను శిల్పా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పనిచేసే కార్యకర్తలను రాష్ట్రస్థాయి నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి అందరికీ పదవులను అందించారని అన్నారు.

 ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నాయకుని లక్షణమని, అది కేవలం వైఎస్‌ కుటుంబానికే దక్కుతుందని అన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వాల్మీకులను ఎస్టీల్లో, మాదాసు కురువ, బుడగజంగాలను ఎస్సీలో చేరుస్తామని చంద్రబాబు నమ్మించి మోసం చేశారన్నారు. అనంతరం బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్‌ నాయుడు మాట్లాడుతూ బీసీల అభివృద్ధే ధ్యేయంగా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి బీసీసెల్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. జగన్‌కు ఏకూటమితోనూ పనిలేదని, తనది బడుగు,బలహీన వర్గాలకు చెందిన కూటమని, వారి సహకారంతోనే ముందుకు వెళుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మాధవరం సర్పంచ్‌ శ్రీను,నారాయ ణరెడ్డి, బండి ఆత్మకూరు మండల కార్యదర్శి పుల్లారెడ్డి, నాగేశ్వరరెడ్డి, బాలసుబ్బయ్య, రామలింగారెడ్డి, రామసుబ్బారెడ్డి, సుదర్శనం తదితరులు  పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top