
అనంతపురం సెంట్రల్: మహిళా, శిశు సంక్షేమశాఖ పెనుకొండ ప్రాజెక్టు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి ఆస్తులపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధకశాఖ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో పలువురు సీఐలు ఎనిమిది బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేశారు. అనంతపురం జిల్లాతో పాటు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పాకాల మండలం రామచేర్ల గ్రామంలోనూ సోదాలు చేపట్టారు. దాడుల్లో దాదాపు రూ.50 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. విచారణ అనంతరం నిందితుడిని కస్టడీలోకి తీసుకుని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ జయరామరాజు వెల్లడించారు.