బస్సు నుంచి జారిపడిన విద్యార్థి

School Student Injured In Bus Accident Get Coma - Sakshi

కోమాలోకి వెళ్లిన సాయి

తిరుమల ప్రసాద్‌ ఆస్పత్రిలో చికిత్స

విజయనగరం, మెంటాడ: బస్సు నుంచి జారిపడి ఒకరు కోమాలోకి వెళ్లిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి తల్లి, గ్రామస్తులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జగన్నాథపురానికి చెందిన రామవరపు సాయి గజపతినగరం మండలం పురిటిపెంట గాయత్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సాయి తండ్రి పదేళ్ల కిందటే మరణించడంతో ఆర్థిక ఇబ్బందులున్నాయి.

ఈ క్రమంలో చదువు ఆగకూడదనే ఉద్దేశంతో సాయి సమవి ప్రైవేట్‌ కళాశాల బస్సులో హెల్పర్‌గా విధులు నిర్వహిస్తూ గాయత్రీ కళాశాలలో చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం విధులకు హాజరయ్యాడు. ఆండ్ర నుంచి బస్సు వస్తుండగా జగన్నాథపురం, పిట్టాడ గ్రామాల మధ్య సాయి పడిపోవడంతో తలకు బలమైన దెబ్బలు తగిలి కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే సాయిని విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే డ్రైవర్‌ బి. శ్రీను నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ పడిపోయాని బాధిత విద్యార్థి తల్లి తిరుపతమ్మ ఆరోపించింది. ఎటువంటి లైసెన్స్‌ లేని వ్యక్తిని డ్రైవర్‌గా ఎలా నియమించారని ప్రశ్నించింది. ఆండ్ర పోలీసులు విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top