సీఏఎస్‌కు 11 ప్రాజెక్టులు సిద్ధం | Reday to CAS 11 projects | Sakshi
Sakshi News home page

సీఏఎస్‌కు 11 ప్రాజెక్టులు సిద్ధం

Mar 8 2017 12:01 AM | Updated on Aug 20 2018 3:09 PM

జిల్లాలోని 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఏప్రిల్‌ 1 నుంచి కామన్‌ అప్లికేషన్‌ స్టాఫ్‌వేర్‌ (సీఏఎస్‌) విధానాన్ని అమలు

ఒంగోలు టౌన్‌: జిల్లాలోని 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఏప్రిల్‌ 1 నుంచి కామన్‌ అప్లికేషన్‌ స్టాఫ్‌వేర్‌ (సీఏఎస్‌) విధానాన్ని అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 2155 మంది అంగన్‌వాడీలకు స్మార్ట్‌ ఫోన్లు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌ను కూడా తయారుచేశారు. సీఏఎస్‌ విధానం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షణాల్లో తెలుసుకునే వీలుంటుంది.

 సీడీపీఓ మొదలుకొని జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలోని ఉన్నతాధికారులు సైతం ఆ అంగన్‌వాడీ కేంద్రాల స్థితిగతులను తెలుసుకొని మానిటరింగ్‌ చేయనున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు పరిధిలో తొలి విడతగా ఒంగోలు అర్బన్, కొండపి, కందుకూరు అర్బన్, మార్కాపురం అర్బన్, వేటపాలెం, పరుచూరు, కొరిశపాడు, సంతమాగులూరు, కనిగిరి, పొదిలి, గిద్దలూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో సీఏఎస్‌ విధానాన్ని అమలు చేయనున్నారు.

10 రకాల రిజిస్టర్లకు ఫుల్‌స్టాప్‌:
అంగన్‌వాడీ కేంద్రాల్లో సంబంధిత కార్యకర్తలు పదకొండు రకాల రిజిస్టర్లు నిర్వహిస్తుంటారు. చిన్నారుల హాజరు శాతం దగ్గర నుంచి లబ్ధిదారులకు అందించే పోషకాహారం వరకు ప్రతిదానికి సంబంధించి ఒక రిజిస్టర్‌ నిర్వహిస్తుంటారు. ఆ రిజిస్టర్‌లో రోజువారీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తూ ఉంటారు. అయితే నూతనంగా 11 ప్రాజెక్టుల్లో అమలు చేయనున్న సీఏఎస్‌ విధానంతో పదిరకాల రిజిస్టర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నారు. లబ్ధిదారులకు అందించే పోషకాహార రిజిస్టర్‌ను మాత్రం యధావిధిగా కొనసాగిస్తుంటారు.  రాష్ట్రాల వారీగా రకరకాల పోషకాహారం అందిస్తున్న నేపథ్యంలో ఈ ఒక్క రిజిస్టర్‌ను మాత్రం ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు యధావిధిగా నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమశాఖ కేంద్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.  

నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికే..   
సీఏఎస్‌ విధానం అమలులోకి వచ్చిన తరువాత అంగన్‌వాడీలు నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన పర్యవేక్షణను సెక్టార్‌ సూపర్‌వైజర్‌ మొదలుకొని ప్రాజెక్టు డైరెక్టర్‌ వరకు చూస్తూ వచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీలు చేస్తూ ఎక్కడైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే వారికి హెచ్చరికలు జారీ చేయడం, అప్పటికీ మాట వినకుంటే మెమోలు జారీ చేయడం వంటివి జరుగుతూ వచ్చాయి. సీఏఎస్‌ విధానం అమలులోకి వచ్చిన తరువాత సంబంధిత కేంద్రాలను రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎన్ని గంటలకు తెరుస్తున్నారు.

ఆ కేంద్రంలో మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు ఎంతమంది నమోదై ఉన్నారు? రోజువారీగా ఎంతమంది హాజరవుతున్నారు? గర్భిణులు, బాలింతలు ఎంతమంది ఉన్నారు? వారిలో ఎంతమందికి పోషకాహారం అందిస్తున్నారు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న కామన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌కు జీపీఎస్‌ను అనుసంధానం చేస్తుండటంతో వాటికి సంబంధించిన యాప్‌ను తెరిచిన వెంటనే క్షణాల్లో డేటా వివరాలు ప్రత్యక్షం అవుతాయి.


నేడు బ్లాక్‌ కో ఆర్డినేటర్లకు శిక్షణ
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్న సీఏఎస్‌ విధానంపై ఇటీవల నూతనంగా నియమితులైన బ్లాక్‌ కో ఆర్డినేటర్లకు మంగళవారం రాష్ట్ర డైరెక్టరేట్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే              రాష్ట్ర స్థాయిలో రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు శిక్షణ ఇచ్చారు. సీఏఎస్‌ విధానం గురించి బ్లాక్‌ కో ఆర్డినేటర్లు శిక్షణ పొందిన               అనంతరం జిల్లాలోని 2155 అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి స్మార్ట్‌ ఫోన్లను కూడా వారికి అందించ నున్నారు. శిక్షణ పొందిన బ్లాక్‌ కో ఆర్డినేటర్లు ప్రాజెక్టుల వారీగా అంగన్‌వాడీ కార్యకర్తలకు సీఏఎస్‌ విధానంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియను నెలాఖరుకల్లా పూర్తిచేసి ఏప్రిల్‌ 1 నుంచి సీఏఎస్‌ను అమలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement