మండలంలోని కాజ టోల్గేట్ వద్ద లారీలో సుమారు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు.
మంగళగిరి : మండలంలోని కాజ టోల్గేట్ వద్ద లారీలో సుమారు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు.సేకరించిన వివరాల మేరకు గుంటూరులో వారెంట్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న బి.హరిబాబు,శ్రీనివాసరావు వారెంట్ పనిపై గురువారం ఉదయం తాడేపల్లికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మండలంలోని కాజ టోల్గేట్ దాటిన అనంతరం ఒక లోడు లారీ ఆపి ఉండడం గమనించారు.
అక్కడ లారీ డ్రైవర్తో పాటు మరో ఇద్దరు వాదులాడుకుంటున్నారు. కానిస్టేబుళ్లు తమ వాహనాన్ని ఆపి ఏమిటి అని ప్రశ్నించగా వారు అక్కడ నుంచి పారిపోయారు. కానిస్టేబుళ్లు లారీలో ఉన్న సరుకును గమనించగా, అవి రేషన్ బియ్యం కావడంతో మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బియ్యం లారీని విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. వారు ఆ లారీని పౌర సరఫరాల శాఖ గోడౌన్కు తరలించారు.
పారిపోయారా...తప్పించారా...
లారీతో పాటు దొరికిన డ్రైవర్, మరో ఇద్దరు పారిపోయారా..లేక అధికారపార్టీ నేతల ఒత్తిడితో తప్పించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. లారీని పట్టుకున్న కానిస్టేబుల్ మాట్లాడుతూ లారీ ఒంగోలుకు చెందిన యడ్ల మస్తాన్రావుదని, రేషన్ బియ్యాన్ని యర్రంశెట్టి కిషోర్,యర్రంశెట్టి సాంబశివరావు,పులగం సాంబశివరావు కలిసి గురువారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని పొలాల్లో లోడ్ చేశారని, లోడును తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం తరలిస్తున్నారని తెలిపారు. లారీని పట్టుకున్నప్పుడు లారీ డ్రైవర్తో పాటు మరో ఇద్దరు పారిపోతే పట్టుకున్న పోలీసులకు ఈ వివరాలన్నీ ఎలా తెలిశాయో అంతుచిక్కడం లేదు.
వివరాలన్నీ సేకరించిన పోలీసులు ఉన్నతాధికారులకు తెలపగా, ఇంతలో బియ్యం స్మగ్లర్లు అధికార పార్టీ నేతల ద్వారా తీవ్ర ఒత్తిడి తెచ్చి డ్రైవర్తో పాటు మరో ఇద్దరిని తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తత్ఫలితంగా అసలు నేరస్తులు బయటకు రాకుండా తప్పించుకోవడానికి దోహదం చేసినట్టయిందని అంటున్నారు. ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు తలొగ్గకుండా సమగ్రంగా విచారించి అసలైన నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప రేషన్బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేరు.