ఉప్పుటేరును మింగేస్తున్నారు..!

Rampant Encroachments Thrive At Upputeru River In Krishna District - Sakshi

ఆక్రమణలకు అడ్డా లక్ష్మీపురం

డ్రెయిన్, ఇరిగేషన్‌ స్థలాలు కబ్జా

యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

పట్టించుకోని అధికారులు

సాక్షి, కృష్ణా: సామాన్యుడి ఇల్లు రోడ్డు నిర్మాణం పేరుతో తొలగిస్తే అతనికి మరో చోటు ఆశ్రయం కల్పించడానికి సెంటు భూమి కూడా ఇవ్వలేరు.. నిరుపేదల కష్టాలు వారికి పట్టనే పట్టవు. కానీ రూ.కోట్ల  విలువైన పక్కా నిర్మాణాలు చేసుకోవడానికి, భారీ స్థాయిలో వ్యాపారం చేసుకోవడానికి ఉప్పుటేరు, ఇరిగేషన్, డ్రెయినేజీ భూములను ఆక్రమించుకుని అనుమతి లేని నిర్మాణాలు చేస్తుంటే కనీసం అటువైపు అధికారులు కన్నెత్తైనా చూడటం లేదు.. ఇదీ  కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలోని దుస్థితి. జిల్లాకు శివారు ప్రాంతమైన లక్ష్మీపురంలో రూ.కోట్ల  విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిపై అధికారులు అజమాయిషీ కొరవడటంతో    భారీ కట్టడాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వంలో ఇవి మరింత జోరందుకున్నాయి. నాటి పాలకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురైపోయాయి.

అంతా బంగారమే!
జిల్లాకు శివారునున్న లక్ష్మీపురం పంచాయతీలో ఇప్పుడు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక్కడ భూమి విలువ ప్రధాన పట్టణాలకంటే అధికంగా పలుకుతుంది. లాకు సెంటరులో అధికంగా ఇరిగేషన్, ఉప్పుటేరు పోరంబోకు భూములున్నాయి. వీటిని స్థానికులు కొందరు ఆక్రమించుకుని భారీ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ భూముల్లో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేయడం వెనుక గతంలో రాజకీయ పెద్దల హస్తంతో పాటు, అధికారులు అండ కూడా పుష్కలంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి.

ఉప్పుటేరును పూడ్చి..
లక్ష్మీపురం లాకు సెంటర్‌ మీదుగా కొల్లేరు నీటిని సముద్రంలోకి చేరవేసే ఉప్పుటేరు పాయ ప్రవహిస్తుంది. దీన్ని పూడ్చుకుంటూ కొందరు కట్టడాలు నిర్మించగా, మరి కొందరు భారీ ఎత్తున వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇక్కడి నిర్మాణాలకు పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు.  లాకుల  వద్ద ఇరిగేషన్‌న్‌ భూముల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు రహదారిని ఆనుకుని య«థేశ్ఛగా జరుగుతున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పేదల ఇళ్లు తొలగించినా..
216 జాతీయ నిర్మాణం పేరుతో లక్ష్మీపురంలో కొందరి పేదల ఇళ్లు తొలగించారు. ఇంతవరకు బాధితులకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా కేటాయించలేదు. కాని తమ కళ్ల ముందే రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు ఈ ఆక్రమణలు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు.

అధికారులు స్పందిస్తారా..?
కృష్ణా నది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను ఇటీవల అధికారులు కూల్చివేసినట్టుగానే ఉప్పుటేరు, ఇరిగేషన్‌ భూముల్లోని అక్రమ కట్టడాల విషయంలో కూడా చర్యలు తీసుకుంటారా? అనే సందేహం ప్రజల్లో  నెలకొంది.  వీటిపై పంచాయతీ అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వ భూముల్లో కట్టడాలకు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top