‘సూపర్ ఫైన్’..కొనుగోళ్లు నిల్ | Purchases nil on super fine BPT grain | Sakshi
Sakshi News home page

సూపర్ ఫైన్’..కొనుగోళ్లు నిల్

Dec 7 2013 1:20 AM | Updated on Sep 2 2017 1:20 AM

సూపర్ ఫైన్ బీపీటీ ధాన్యం పండించిన రైతులకు ప్రోత్సాహక ధర అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ధాన్యం లేక వెలవెలబోతున్నాయి.

మిర్యాలగూడ, న్యూస్‌లైన్: సూపర్ ఫైన్ బీపీటీ ధాన్యం పండించిన రైతులకు ప్రోత్సాహక ధర అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ధాన్యం లేక వెలవెలబోతున్నాయి. మద్దతు ధరకు తేమశాతం లింకు పెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.  బయటి మార్కెట్‌లో మద్దతు ధర కంటే అధికంగా ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. దాంతో ఖరీఫ్ సీజన్‌లో క్వింటా ధాన్యం కూడా రైతుల నుంచి ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేయలేదు. సివిల్ సప్లయీస్ అధ్వర్యంలో జిల్లా లో మిర్యాలగూడ, నల్లగొండ, భువనగిరి, సూ ర్యాపేట, తిరుమలగిరి, మోత్కూర్‌లో సూపర్ ఫైన్ బీపీటీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఖరీఫ్‌లో రైతులు పండించిన గ్రేడ్ -1 రకం ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు 1345 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు 1310 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే సూపర్‌ఫైన్ బీపీటీ ధాన్యాన్ని ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు *1500 చెల్లించాలని నిర్ణయించింది.
 తేమశాతంతో లింకు..
 సూపర్ ఫైన్ బీపీటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు ధాన్యం తేమశాతంతో లింకు పెడుతున్నారు. 17శాతం తేమ కంటే తక్కువగా ఉంటేనే ప్రభుత్వం నిర్ణయించిన ధర క్వింటాకు *1500 చెల్లిస్తున్నారు. కాగా ఇటీవల వరుస తుపానుల కారణంగా రైతులు మిషన్ల ద్వారా వరి కోతలు కోస్తున్నారు. దీని వల్ల ధాన్యానికి తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో సూపర్ ఫైన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లేకంటే బయటి మార్కెట్‌లో విక్రయించుకుందామనే భావనలో రైతులు ఉన్నారు. నేరుగా మిల్లుల వద్దకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర 1500 రూపాయల కంటే అధికంగా ఇస్తుండడం కూడా మరో కారణంగా తెలుస్తోంది.  ప్రభుత్వం కూడా ప్రైవేటు వ్యాపారుల ధర చెల్లిస్తే రైతులు విక్రయించేం దుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement