
ప్రజలకు సివిక్ సెన్స్లేదు
‘దేశ ప్రజలకు సివిక్ సెన్స్లేదు..రోడ్డు మీద ఉమ్మి వేస్తారు. మూత్ర విసర్జన చేస్తారు. చివరికి చెత్తా చెదారం రోడ్డుపైనే వేస్తారు. సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి పనులు చేస్తే భారీగా జరిమానాలు...
- వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్
- విద్యార్థులతో కేంద్రమంత్రి వెంకయ్య
విజయవాడ : ‘దేశ ప్రజలకు సివిక్ సెన్స్లేదు..రోడ్డు మీద ఉమ్మి వేస్తారు. మూత్ర విసర్జన చేస్తారు. చివరికి చెత్తా చెదారం రోడ్డుపైనే వేస్తారు. సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి పనులు చేస్తే భారీగా జరిమానాలు విధిస్తారని’ కేంద్ర పట్టణాభివృద్ధి పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.
తాను 1980లో సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడ గైడ్ పదే పదే ఉమ్మివేయవద్దని, చెబుతుంటే ఏమిటయ్యా అని అడిగితే... అలా చేస్తే 500 ఫౌండ్లు జరిమానా వేస్తారని చెప్పాడన్నారు. అసలు అప్పుడు నేను తీసుకెళ్లిందే అంతమొత్తమని, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ జరిమానా విధిస్తున్నారని చెప్పారు. నాకు అవకాశం వస్తే సివిక్సెన్స్పై ప్రజలకు పాఠాలు చెప్పాలని ఉందని అన్నారు.
వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శనివారం మహాత్మాగాంధీ రోడ్డులోని కాఫీ విత్ కన్సర్వేషన్(కాఫీ తాగుతూ కబుర్లు) కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వెంకయ తనదైన శైలిలో సమాధానాలు ఇస్తూ విద్యార్ధులకు ఉత్సాహ పర్చడంతో పాటు ఆలోచింపజేశారు.
విద్యార్థి : సర్ దేశంలో పాలిటిక్స్ ఎలా వున్నాయి?
వెంకయ్య: రాజకీయం లే కుండా దేశం లేదు. కానీ రాజకీయ నాయకులంటే దేశంలో విలువలేదు. ఒకప్పుడు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వుండేవారు. నేడు అవకాశ వాదులుగా మారుతున్నారు.
విద్యార్థి: సర్ మీ అభిమాన నటుడు?
వెంకయ్య : నాకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం, ఆయన కృష్ణుడు పాత్రలో నటించినా మరి ఏ ఇతర పాత్రల్లో నటించినా దానిలో లీనమయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితివేరు. వన్డే హీరో..ఆఫ్ డే హీరోయిన్లా అయింది.. పట్టుమని పదిరోజులు కూడా సినిమా ఆడటం లేదు.
విద్యార్థి : సర్ మీకు ఇష్టమైన వంట?
వెంకయ్య : నాకు చింతకాయ పచ్చడి అంటే ఎంతో ఇష్టం. నెల్లూరు చేపల పులుసు, ఆవకాయ, గోంగూర పచ్చళ్లు ఇష్టంగా తింటాను. అంతేకాని పిజ్జాలు, బర్గర్లు వంటివి నా వంటికి పడవు.
విద్యార్థి : సర్ మీ టూరిజం ప్లేస్
వెంకయ్య : నా గ్రామమే నాకు ఎంతో ఇష్టమైన పర్యాటక ప్రదేశం . నాకు ఖాళీ దొరికినప్పుడల్లా మా గ్రామానికి వెళ్లడానికే ఇష్టపడతా. నేను మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి కిరసనాయిలు దీపం కింద చదువుకున్నా. నా కుటుంబానికి బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. కష్టపడి ఈ స్థాయికి వచ్చా. . కానీ నేడు మీరు సూటు, బూటు ధరించిస్టార్ హోటళ్లలో ఫంక్షన్లు జరుపుకుంటున్నారు. మీరు కష్టపడి క్రమశిక్షణతో ఉంటేనే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
విద్యార్థి : దేశాన్ని గుజరాత్ తరహా అభివృద్ధి అంటున్నారు అంటే ఏమిటి?
వెంకయ్య : అన్ని రాష్ట్రాలను గుజరాత్ తరహాలో అభివృద్ధి చేయలేం. ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో రీతిలో అభివృద్ధి చేయాల్సి వుంటుంది. యువ విద్యార్థిలా మారాలనుకుంటున్నా.
కాగా ప్లేస్మెంట్స్ పొందిన వెస్టిక్ కాలేజీ విద్యార్థులకు వెంకయ్య నియామక పత్రాలు అందజేశారు. డెరైక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.