నేటి తరం రాజకీయాలకు కొత్త అర్థం చెప్పాలి. నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు
రాజకీయాలకు కొత్త అర్థం చెప్పాలి’
Nov 7 2013 1:49 AM | Updated on Sep 17 2018 5:12 PM
దేవీచౌక్ (రాజమండ్రి), న్యూస్లైన్:నేటి తరం రాజకీయాలకు కొత్త అర్థం చెప్పాలి. నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో బుధవారం రాత్రి జరిగిన ప్రజా చైతన్యభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఈ వ్యవస్ధ పతనానికి మనమందరమూ కారకులమే అన్నారు. విషబీజాలు నాటి అమృత ఫలాలు రావాలంటే, ఎలా వస్తాయి? అని ఆయన ప్రశ్నించారు. మన సమస్యలకు మనమే కారకులమైనట్టే, మన సమస్యలకు పరిష్కారాలు కూడా మన చేతిలోనే ఉన్నాయన్నారు.
ఢిల్లీ సుల్తానులు, మొగలాయి పాదుషాలు, బ్రిటిష్ వైస్రాయ్లు చేయలేని పనిని నేటి పాలకులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికయిన శాసన సభ్యుల మాటకు విలువలేదు, ప్రజాభిప్రాయానికి తావు లేదు. కలిసి ఉండాలో, విడిపోవాలో నిర్ణయించునేది తెలుగు ప్రజలు తప్ప మరెవ్వరు కాదని జేపీ అన్నారు. దేశ ప్రధానితో సహా నాయకులు అందరూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం తెలుగుప్రజల సమస్య మాత్రమే కాదు, రేపు ఇటువంటి సమస్యలు పొరుగురాష్ట్రాలకూ ఎదురు కావచ్చునని ఆయన అన్నారు.
పభుత్వ సంస్థలు, ప్రతిష్ఠాత్మకమయిన విద్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్యం అన్నీ హైదరాబాద్ నగరంలోనే ఉండటంతో సమస్య పెద్దదయింది అని అన్నారు. ఆ సంస్థలు రాష్ట్రమంతటా విస్తరించి ఉంటే నేడు ఇంతటి తీవ్ర సంక్షోభం తప్పేదన్నారు. లోక్సత్తా ముందునుంచీ అధికార వికేంద్రీకరణ జరుగాలనే కోరుతోందన్నారు. యువత కొత్త వ్యవస్థను తీసుకురావడంలో క్రియాశీలక పాత్రను పోషించాలని జేపీ అన్నారు. జిల్లా అధ్యక్షుడు పీవీవీఎస్ కృష్ణారావు, ఉపాధ్యక్షుడు కిరణ్ బాబు, జాతీయ ఉపాధ్యక్షుడు వై.వి.రామారావు, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షుడు జె.రవి, నగర అధ్యక్షుడు డాక్టర్ వి.వి. రామారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement


