పార్ట్‌ టైం స్వీపర్ల వెట్టిచాకిరి! | Part time Sweepers work Full Time in Andhra Pradesh Schools | Sakshi
Sakshi News home page

పార్ట్‌ టైం స్వీపర్ల వెట్టిచాకిరి!

Sep 12 2013 2:20 AM | Updated on Sep 1 2017 10:37 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేల మంది పార్ట్‌టైం స్వీపర్లతో విద్యాశాఖ వెట్టిచాకిరి చేయిస్తోంది. పేరుకు పార్ట్‌టైం ఉద్యోగులే అయినా ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు (ఫుల్‌టైం) అన్ని పనులూ వారితోనే చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తోంది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేల  మంది పార్ట్‌టైం స్వీపర్లతో విద్యాశాఖ వెట్టిచాకిరి చేయిస్తోంది. పేరుకు పార్ట్‌టైం ఉద్యోగులే అయినా ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు (ఫుల్‌టైం) అన్ని పనులూ వారితోనే చేయి స్తూ శ్రమ దోపిడీ చేస్తోంది. పాఠశాలల్లో రూ. 75 వేతనంతో పార్ట్‌టైం స్వీపర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం నెలకు రూ. 1,623 చెల్లిస్తోంది. అది కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోకపోయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నారు. తీరా ఆ కొద్ది వేతనమైనా గత ఏడాది డిసెంబర్ నుంచి చెల్లించకపోవడంతో పార్ట్‌టైం స్వీపర్లంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారికి సంబంధించిన వేతనాలు చెల్లించే పద్దును ఆర్థిక శాఖ రద్దు చేయడమే ఇందుకు కారణం. వేతనాల కోసం వారంతా గత 9 నెలలుగా ఆర్థిక శాఖ, విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా  అవి పట్టించుకోవట్లేదు.
 
 ఏటా ఆర్థిక శాఖ పార్ట్‌టైం స్వీపర్ల వేతనాలను 2202-01-103-05-310/312 పద్దు కింద విడుదల చేస్తోంది. 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా మొదటి, రెండో త్రైమాసిక వేతనాలను ఇదే పద్దు కింద విడుదల చేసింది. అయితే డిసెంబర్ చివరలో రావాల్సిన మూడో త్రైమాసిక, ఏప్రిల్‌లో రావాల్సిన నాలుగో త్రైమాసిక వేతనాలను నిలిపేసింది. ఆర్థిక శాఖ 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆ పద్దును రద్దు చేయడంతో అంతకుముందు సంవత్సరపు వేతనాలూ ఆగిపోయాయి. ఈ విషయమై స్వీపర్లు ప్రభుత్వానికి, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు విన్నవించారు. అయితే ప్రభుత్వం ఆర్‌వీఎం/ఆర్‌ఎంఎస్‌ఏ నిధులను తీసుకోవాలని సూచించడంతో పాఠ శాల విద్యాశాఖ ఆర్‌వీఎంకు లేఖ రాసింది. కానీ ఆర్‌వీఎం తమ నిధుల నుంచి వారి వేతనాలు ఇవ్వడం కుదరదని తెగేసిచెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement