పల్లెలకు బిల్లుల షాక్‌ | panchayath office power bills pending | Sakshi
Sakshi News home page

పల్లెలకు బిల్లుల షాక్‌

Nov 8 2017 6:41 AM | Updated on Nov 8 2017 6:41 AM

panchayath office power bills pending - Sakshi

జిల్లాలోని పలు పంచాయతీలు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నాయి. సరైన ఆదాయ వనరుల్లేని కారణంగా నెలవారీ విద్యుత్తు బిల్లుల చెల్లింపులు కష్టమవుతున్నాయి. నెలనెలా పెరుగుతున్న బిల్లులు గుదిబండగా మారి ఆందోళన కలిగిస్తున్నాయని పంచాయతీల పాలకులు గగ్గోలు పెడుతున్నారు. మరో పక్క బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్తు సరఫరా చేస్తామని, లేదంటే నిలిపేస్తామని సంబంధిత శాఖల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు పంచాయతీలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ఆయా పల్లెల్లో చీకట్లు అలముకున్నాయి.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో 1043 గ్రామ పంచా యతీలు విద్యుత్‌ సరఫరాను పొందుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలకు చెందిన సర్ఫేస్‌ బోర్లకు సంబం ధించి 12 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 11,210 వీధిలైట్ల కనెక్షన్లు ఉన్నాయి. వీటి విద్యుత్తు బిల్లుల రూపేణా నెలకు రూ.7.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఒక్కో పంచాయతీ నెలకు రూ. 15 వేల నుంచి గరిష్టంగా రూ.30 వేల దాకా బిల్లులు చెల్లించాలి. అయితే పంచాయతీల్లో ని«ధులు లేవు. సరైన ఆదాయ వనరుల్లేని కారణంగా ఇవి నెలవారీ విద్యుత్తు బిల్లులను చెల్లించడంలో వెనుకబడుతున్నాయి. దీంతో 2010నుంచి ఇప్పటివరకూ పంచాయతీలు చెల్లించాల్సి న విద్యుత్తు బకాయిలు రూ.220 కోట్లకు చేరాయి.

నోటీసుల మీద నోటీసులు...
జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 విద్యుత్తు డివిజన్లలోనూ అన్ని కేటగిరీలకు చెందిన 20 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నా యి. రోజుకు 4 లక్షల యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుంది. డిమాండ్‌కు తగ్గ విద్యుత్‌ సరఫరా జరుగుతున్నా బిల్లులు మాత్రం సకాలంలో అందడం లేదని ఎస్పీడీసీఎల్‌ మండిపడుతోంది. పంచాయతీల బిల్లుల చెల్లింపులో రాష్ట్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుం డటంతో ఎస్పీడీసీఎల్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారిం ది. దీంతో బిల్లులు చెల్లించాలని సంబంధిత ఏడీఈలు నెలనెలా జిల్లా పంచాయతీ అధికారికి, గ్రామ సర్పంచులకు, విలేజ్‌ సెక్రెటరీలకు నోటీసులు జారీ చేస్తోంది.

ఏప్రిల్‌ నుంచి కూడా చెల్లింపులు నిల్‌..
పాత బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటన చేసింది. ఏప్రిల్‌ 2017 వరకూ ఉన్న బకాయిలను పంచాయతీలు చెల్లించాల్సిన పనిలేదని, ఆ తరువాత చెల్లింపులు మాత్రం జరుపుకోవాలని సూచిం చింది. ఈ లెక్కన ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ పంచా యతీలు రూ.52 కోట్ల దాకా చెల్లించాలి. కనీసం వీటినన్నా కట్టాలని విద్యుత్తు అధికారులు పట్టుబడుతున్నారు. బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చూపే పంచాయతీలకు సరఫరా నిలిపివేస్తామని హెచ్చరికలు కూడా చేశారు. అప్పటికీ స్పందించని 40 పంచాయతీల్లో విద్యుత్తు సరఫరాను మూడు నెలల కిందట నిలిపేశారు. దీంతో సంబంధిత సర్పంచులు విద్యుత్తు కార్యాలయాలకు వెళ్లి లిఖితపూర్వకంగా లెటర్లు ఇచ్చారు. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ పడగానే చెల్లిస్తామని చెప్పారు. దీంతో అధికారులు ఆయా గ్రామాలకు తిరిగి సరఫరాను పునరుద్ధరించారు.

అడ్వాన్సు చెక్కులిస్తే సరి..
పంచాయతీలకు త్వరలోనే 14వ ఆర్థిక సంఘం నిధులు జమయ్యే అవకాశం ఉంది. ఈ లోగా ఎక్కువ మొత్తం బకాయిలు చెల్లించాల్సిన సర్పంచులు అడ్వాన్సు చెక్కులు అందజేస్తే బాగుంటుందని చెబుతున్నాం. కనీసం మూడు నెలలకు ఇవ్వాల్సిన మేర బిల్లులైనా చెక్కుల రూపంలో అందజేయాల్సి ఉంది. అప్పుడే విద్యుత్తు సరఫరా నిరాటంకంగా చేయగలం. గ్రామ సర్పంచులు బిల్లుల చెల్లింపులో సహకరించాలి. – హరినాథరావు, ఎస్‌ఈ,ఏపీఎస్పీడీసీఎల్, తిరుపతి సర్కిల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement