
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దాగుడుమూతలాడుతోందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. నిజానిజాలేమిటో ప్రజలకు తెలియజేసేందుకు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రాజెక్టు నిధులు, సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో మాట్లాడేందుకు తక్షణమే అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకం కానుందా?’ అన్న అంశంపై సోమవారమిక్కడ వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం కో–ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు, ప్రజా, రైతు సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ అధికారులతో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులు, నాణ్యత, నిధులు తదితర అంశాలపై వక్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు నాణ్యత, నిధుల అవకతవకలపై ప్రశ్నించే వారిని.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిరోధకులు, రాక్షసులుగా చిత్రీకరిస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ ఎస్ఈ విప్పర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ.. కాఫర్ డ్యాం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతోందని మండిపడ్డారు. ప్రాజెక్టు ఆలస్యంపై ప్రజలు ఇప్పటికీ ప్రశ్నించకపోతే తీవ్ర నష్టం తప్పదని మరో రిటైర్ట్ ఎస్ఈ సానా నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
పనులవ్వకుండానే గేట్లు ఎత్తుతారా!
స్పిల్వే, స్పిల్ చానెల్, హెడ్వర్క్స్, కాఫర్ డ్యాం పూర్తి చేయకుండానే.. సంక్రాంతి నాటికి గేట్లు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రైతు సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ యేర్నేని నాగేంద్రనాథ్ అన్నారు. ప్రాజెక్టు అంచనాలు ఏ లెక్కన పెంచారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సోమవారం పోలవరం అని చెబుతూ వచ్చిన సీఎం చంద్రబాబు.. అకస్మాత్తుగా ఎందుకు చేతులెత్తేశారని ప్రశ్నించారు. హెడ్వర్క్స్, కాలువలు తదితర ప్రాజెక్టు పనులన్నీ ఏకకాలంలో సమాంతరంగా చేయకపోతే ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోతుందని సోమశిల ప్రాజెక్టు రిటైర్డ్ ఎస్ఈ ఆకుల గంగాధర్రావు అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎన్నిసార్లు అప్రమత్తం చేసినా.. వాటిని పరిగణనలోకి తీసుకోకపోగా అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మండిపడ్డారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జనరల్ సెక్రటరీ త్రినాథ్రెడ్డి, సీపీఐ నేత నల్లా రామారావు, మానవహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, వైఎస్సార్సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, కాంగ్రెస్ నేత ఆకుల భాగ్యలక్ష్మి, భారతీయ కిసాన్ సంఘ్ నేత యార్ల వెంకటాద్రి, బీజేపీ నేత అడబాల రామకృష్ణ, ‘లోక్సత్తా’ రాజగోపాల్, వైఎస్సార్సీపీ రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, రైతు సంఘం నాయకులు జున్నూరి వెకంటేశ్వరరావు, బూరుగుపల్లి సుబ్బారావు పాల్గొన్నారు.
‘పోలవరం’ కోసం పోరాడుతాం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతామని వామపక్షాలు తెలిపాయి. వాస్తవ స్థితిని తెలుసుకునేందుకు ఈనెల 16న తమ పార్టీ నాయకులు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని సీపీఐ సోమవారం పేర్కొంది. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడింది.