ఆశ్రయం కోల్పోయిన విద్యార్థుల.. అభిప్రాయ సేకరణ | opinion collect from Students who lost shelter | Sakshi
Sakshi News home page

ఆశ్రయం కోల్పోయిన విద్యార్థుల.. అభిప్రాయ సేకరణ

Jan 9 2014 5:31 AM | Updated on Jul 23 2018 9:13 PM

ఏనెమీదితండా వీఆర్‌ఓ సంస్థ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 12మంది గిరిజన బాలికలపై జరిగిన లైంగికదాడి సంఘటనలో నిందితులను అరెస్టు చేసి ఆశ్రమ పాఠశాలను మూసివేశారు.

పెద్దవూర, న్యూస్‌లైన్: పెద్దవూర మండలం ఏనెమీదితండా వీఆర్‌ఓ సంస్థ ఆశ్రమ పాఠశాల మూసివేతతో ఆశ్రయం కోల్పోయిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ బుధవారం వారి స్వగ్రామాలకు వెళ్లి కలిసి అభిప్రాయాలను సేకరించింది. ఏనెమీదితండా వీఆర్‌ఓ సంస్థ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 12మంది గిరిజన బాలికలపై జరిగిన లైంగికదాడి సంఘటనలో నిందితులను అరెస్టు చేసి ఆశ్రమ పాఠశాలను మూసివేశారు. వీఆర్‌ఓ సంస్థ హాస్టల్ మూతపడటంతో అందులో చదువుకుంటున్న 45మంది బాలురు, 34మంది బాలికలు ఇంటి ముఖం పట్టారు. ఇందులో లైంగికదాడికి గురైన 12మంది బాలికలను అధికారులు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని స్టేట్‌హోంకు తరలించారు.

 వివిధ గిరిజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను టీంగా ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా విద్యాధికారి ఏనెమీదితండా ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, అసిస్టెంట్ ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో విద్యార్థుల జాబితా లేక అధికారుల టీం కొంత ఇబ్బంది పడ్డారు. చివరకు నాగార్జునసాగర్‌లో ఉన్న హెచ్‌ఎంను తీసుకువచ్చి బాధిత విద్యార్థుల అడ్రస్‌లను తీసుకోవాల్సి వచ్చింది. ఈ కమిటీ బుధవారం మూడు బృందాలుగా విడిపోయి వీఆరోఓ సంస్థ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాధిత విద్యార్థుల గ్రామాలకు వెళ్లి విద్యార్థులు ఎక్కడ చదువుతారో తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

వీరిని అర్హత కలిగిన, వారు ఎంచుకున్న పాఠశాలలో చేర్పించనున్నారు. విద్యార్థులు చదుకొవటానికి ఆసక్తి చూపే జాబితాను తయారు చేసి కలెక్టర్‌కు 10వ తేదీలోపు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవోలు హరికిషన్‌సింగ్, సంజీవరావు, దేవరకొండ, దామరచర్ల, మిర్యాలగూడ బాలుర ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ ప్రిన్సిపాళ్లు నాగేశ్వర్‌రావు, సోమ య్య, కె.సుధాకర్‌రెడ్డి, పెద్దవూర,త్రిపురారం,చందంపేట, చివ్వెం ల, పెద్దగట్టు మినీ గురుకులం పాఠశాలల హెచ్‌ఎంలు బాల్యనాయక్, సుజాత, హైజక్, విమల, చంద్యానాయక్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement