ఇంకానా... ఇకపై చెల్లదు! | Supreme Court Grants Permanent Commission To Women Short Service Commission Officers | Sakshi
Sakshi News home page

ఇంకానా... ఇకపై చెల్లదు!

Mar 25 2026 3:38 AM | Updated on Mar 25 2026 3:38 AM

Supreme Court Grants Permanent Commission To Women Short Service Commission Officers

లింగ వివక్ష అనేది ప్రత్యక్షంగా, కనిపించే రూపంలోనే కాదు... చాపకింద నీరులా కూడా తిష్టవేసి ఉంటుంది. అయితే కాలమే ఆ వివక్షను తొలగిస్తూ వెళుతుంది అనే ఆశాభావానికి సుప్రీం కోర్టు తాజా తీర్పు బలాన్ని ఇస్తోంది. భారత సాయుధ దళాలలో మహిళా షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) అధికారులు పురుషులతో సమానంగా శాశ్వత కమిషన్‌కు అర్హులు అని చారిత్రక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు...‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ అనుకునే సందర్భం ఇది!

సాయుధ దళాల్లో లింగసమానత్వాన్ని బలోపేతం చేసే చారిత్రక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. మహిళా షార్ట్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఎస్‌ఎస్‌సీ) అధికారులకు పురుషులతో సమానంగా శాశ్వత కమిషన్‌కు అర్హత ఉందని స్పష్టం చేసింది. వ్యవస్థాగత పక్షపాతాన్ని ప్రస్తావించింది. మహిళా ఎస్‌ఎస్‌సీ అధికారులకు శాశ్వత కమిషన్‌ను నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతూ ఉన్నత న్యాయస్థానం ఈ చారిత్రాత్మక సంచలన తీర్పును ఇచ్చింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ప్రకారం తనకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. శాశ్వత కమిషన్‌కు సంవత్సరానికి 250 మంది మహిళా అధికారులకే అవకాశం ఇవ్వాలనే నిబం«ధన సరికాదు అని చెప్పింది. గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుకొని ముందుకు సాగేలా, మహిళలకు సమాన అవకాశాలు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది.

శాశ్వత కమిషన్‌ ప్రకారం...
షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌లో పది నుంచి పద్నాలుగేళ్లు పనిచేస్తారు. పై స్థాయికి వెళ్లే అవకాశాలు తక్కువ. ఉద్యోగ విరమణ తరువాత పూర్తిగా పెన్షన్‌ రాదు. ఇక శాశ్వత కమిషన్‌ విషయానికి వస్తే  పదవీ విరమణ చేసే వరకు సేవ చేసే పూర్తి కెరీర్‌ను అందిస్తుంది. ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేయవచ్చు. సీనియర్‌ నాయకత్వ స్థానాలలో పలు హోదాలలో చేరవచ్చు. పింఛన్‌తో సహా అన్ని పదవీ విరమణ ప్రయోజనాలకు అర్హులు అవుతారు.

లోపాలు ఉన్నాయి...
మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ నిరాకరించడం వివక్షపూరితమని పేర్కొంటూ సైన్యం, నావికాదళం రెండింటిలోనూ మహిళా అధికారుల పనితీరును అంచనా వేసే విధానం సక్రమంగా లేదని వ్యాఖ్యానించింది అత్యున్నత న్యాయస్థానం. మహిళా అధికారుల పనితీరును అంచనా వేసే విధానంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కూడా కోర్టు ఎత్తి చూపింది. మహిళా అధికారులు శాశ్వత కమిషన్‌కు ఎప్పటికీ అర్హులు కారంటూ ముందుగా ఏర్పర్చుకున్న అంచనా ఆధారంగా సరైన ఆలోచన లేకుండా, అజాగ్రత్తగా వార్షిక గోప్య నివేదికలను(యాన్యువల్‌ కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌–ఎసీఆర్‌) రూపొందించారని కోర్టు పేర్కొంది. మహిళల శాశ్వత కమిషన్‌కు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో జాప్యం జరిగిందని, దీని ప్రభావం మహిళా అధికారులపై పడింది అని చెప్పింది.

అలా చేయలేదు...
‘తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే కోర్సులు చేయడానికి మహిళా అధికారులను పంపలేదు, అర్హతా ప్రమాణాల ఆధారంగా నియామకాలు (క్రైటీరియా అపాయింట్‌మెంట్స్‌) చేయలేదు. వృత్తిలో వారి పురోగతిపై ఇది ప్రభావం చూపింది’ అని లింగవివక్షతను ఎత్తిచూపింది. శాశ్వత కమిషన్‌కు అర్హులైన మహిళా అధికారులు 20 సంవత్సరాల అర్హత సర్వీస్‌ను పూర్తి చేసినట్లుగా పరిగణించబడతారని, వారు పింఛన్‌తోపాటు తత్సంబంధితమైన అన్ని ప్రయోజనాలకు అర్హులు అవుతారని కోర్టు తెలియజేసింది.

ఇక ముందు అలా జరగకూడదు
నిర్మాణాత్మక పక్షపాతాలను తొలగించడానికి, మహిళా అధికారులు నష్టపోకుండా చూసేందుకు సాయుధ దళాలన్నింటిలోనూ అధికారుల పనితీరును అంచనా వేసే విధానాలపై సమగ్ర సమీక్ష జరపాలని కూడా కోర్టు ఆదేశించింది. మహిళా అభ్యర్థులను ఎన్‌డిఎ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ) ప్రవేశ పరీక్ష రాయడానికి అనుమతించాలని 2021లో సుప్రీం కోర్టు తన మధ్యంతర ఉత్తర్వులో పేర్కొంది. విధాన నిర్ణయం ‘లింగ వివక్షత’పై ఆధారపడి ఉందని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటిస్తూ, సైన్యం వైఖరిని ఖండించింది. అత్యున్నత స్థాయి సైనికాధికారులను తయారుచేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రతిష్ఠాత్మక ఎన్‌డీఏ 2022లో తొలి విడతగా 10 మంది మహిళా క్యాడెట్‌లకు స్వాగతం పలికింది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement