ఒక వైపు ఆలయ ప్రతిష్ఠ జరుగుతుంటే, మరోవైపు బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని నడగాంలో కలకలం రేపింది.
వయసు మరిచిన కామాంధుడు
Mar 13 2014 3:00 AM | Updated on Jul 23 2018 9:13 PM
నరసన్నపేట రూరల్, న్యూస్లైన్: ఒక వైపు ఆలయ ప్రతిష్ఠ జరుగుతుంటే, మరోవైపు బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని నడగాంలో కలకలం రేపింది. లైంగికదాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని నయానభయానలొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్యపరీక్షలకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు, నిందితుడి కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో వృద్ధుడికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం... కోదండ రామాలయ ప్రతిష్ఠ సంబంధిత పనుల్లో మంగళవారం సాయంత్రం నడగాం గ్రామస్తులు తలమునకలయ్యారు. అంతలో ఒక బాలిక ఏడుస్తూ అక్కడికి పరుగుపరుగున వచ్చింది. ఉత్సవంలో మునిగిపోయిన గ్రామస్తులు బాలికను ఏమైందని అడిగారు.
అంతే బాలిక చెప్పిన విషయం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి గ్రామంలో పిల్లపేట వెంకట వీధికి చెందిన బాలిక గ్రామంలోని బంధువుల ఇంటికి రెండు రోజుల కిందట వచ్చింది. సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన బాలికపై అదే గ్రామానికి చెందిన దోంపాక వెంకటి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో పశువులను కాస్తున్న కరణం రామదాసు వచ్చి రక్షించేందుకు ప్రయత్నించాడు. ముందు రామదాసుపై తిరగబడ్డాడు. రామదాసు కేకలు వేస్తుండడంతో డబ్బులిస్తానని మభ్యపెట్టాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. రామదాసుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిపై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రైనీ డీఎస్పీ ఎం.స్నేహిత కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వెంట సీఐ చంద్రశేఖర్, ఏఎస్సై వెంకటరావు ఉన్నారు.
Advertisement
Advertisement