సీమాంధ్రలో స్కూళ్లకు సెలవుల్లేవు! | no holidays for schools in seemandhra area | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో స్కూళ్లకు సెలవుల్లేవు!

Dec 1 2013 2:13 AM | Updated on Sep 15 2018 5:49 PM

పాఠశాలలకు ఈసారి క్రిస్‌మస్, సంక్రాంతి సెలవులు ప్రాంతాల వారీగా వేరువేరుగా ఉండబోతున్నాయి. సీమాంధ్రలోక్రిస్‌మస్, సంక్రాంతి సెలవులు రద్దు చేశారు.

సమ్మెకాలం సర్దుబాటు కోసం ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైద రాబాద్:
పాఠశాలలకు ఈసారి క్రిస్‌మస్, సంక్రాంతి సెలవులు ప్రాంతాల వారీగా వేరువేరుగా ఉండబోతున్నాయి. సీమాంధ్రలోక్రిస్‌మస్, సంక్రాంతి సెలవులు రద్దుకాగా, తెలంగాణలో డిసెంబర్ 24 నుంచి క్రిస్‌మస్ సెలవులు ఉంటాయి.సీమాంధ్రలో మాత్రం క్రిస్టియన్  మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 25న (క్రిస్‌మస్ రోజున) మాత్రమే సెలవు ఇస్తారు.మిగతా రోజుల్లో స్కూళ్లు పనిచేస్తాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక నాన్ మిషనరీ స్కూళ్లకు జనవరి 8 నుంచి 17 వరకు ఇచ్చే సంక్రాంతి సెలవులను కూడా సీమాంధ్రలో ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం పండుగ రోజే సెలవు ఉంటుంది. తెలంగాణ జిల్లాల్లో మాత్రం క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు క్రిస్‌మస్ సెలవులు, మిగతా స్కూళ్లకు సంక్రాంతి సెలవులు యథావిధిగా వర్తిస్తాయని విద్యాశాఖ తెలిపింది. సమ్మెకాలాన్ని పనిదినాలుగా సర్దుబాటు చేయడంతో సీమాంధ్రలో సెలవులు రద్దయ్యాయని విద్యాశాఖ పేర్కొంది.
 
సంక్రాంతి సెలవుల్లోనే అర్ధవార్షిక పరీక్షలు
సీమాంధ్ర జిల్లాల్లో సంక్రాంతి సెల వులు రద్దు చేసినందున జనవరి 8 నుంచి 17 మధ్యలో అర్ధవార్షిక పరీక్షలు నిర్వహిం చాలని విద్యాశాఖ నిర్ణయించింది. తెలంగాణ జిల్లాల్లో మాత్రం డిసెంబర్ 16 నుంచి 21 వరకు యథావిధిగా అర్ధవార్షిక పరీక్షలు జరుగుతాయి.
 
జూ.కాలేజీలకు జనవరి 11 నుంచి సెలవులు
జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. అయితే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో మాత్రం 13, 14, 15 తేదీల్లో మాత్రమే సెలవులుంటాయి.రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లెక్చరర్లు సమ్మె చేసినందున నష్టపోయిన పనిదినాలను సెలవు దినాల్లో సర్దుబాటు చేస్తున్నారు. దీంతో సెలవులను మూడు రోజులకే ఇంటర్ బోర్డు కుదించింది.

Advertisement
 
Advertisement
Advertisement