ఆన్‌లైన్‌ మోసం.. నైజీరియన్‌ అరెస్ట్‌

Nigerian arrest  online cheating

నష్టాలు పూడ్చుకుందామనుకుని ఊబిలో దిగిన భార్యాభర్తలు

చివరికి పోలీసులను ఆశ్రయించి నిందితుడిని పట్టిచ్చిన వైనం

అనంతపురం సెంట్రల్‌: ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న డెస్మండ్‌ ఓఈబో అనే నైజీరియా దేశస్తుడిని రాప్తాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రా ప్తాడు మండల పరిధిలోని రేణుకా గేటెడ్‌ కమ్యూనిటీ టౌన్‌ షిప్‌లో కవిత, మారుతి దంపతులు నివసిస్తున్నారు. భర్త మారుతి అనంతపురంలో చికెన్‌ వ్యాపారం చేస్తుండగా భార్య కవిత ఇంట్లోనే చీరల వ్యాపారం చేస్తోంది. ఇద్దరికీ వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి. అప్పుల నుంచి గట్టెక్కాలని వారు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఆన్‌లైన్‌లో కిడ్నీ ఇస్తే రూ.కోటి ఇస్తామని నమ్మబలుకుతూ  డాక్టర్‌ అమర్‌ పేరున ఒక ప్రకటన కనిపించింది. దీంతో వారు అందులో ఇచ్చిన 80507 73651 నెంబర్‌కు ఫోన్‌ చేశారు. ఆ వ్యక్తి సూచన మేరకు రూ.11 వేలు చెల్లించి రిజష్టర్‌ చేసుకున్నారు. కిడ్నీ మార్పిడి చేయాలంటే కొన్ని నిబంధనలు, షరతులు ఉంటాయ ని, రకరకాల సర్టిఫికెట్లు అవసరమవు తాయని ఆ వ్యక్తి చెప్పి నమ్మించడంతో వారు దశలవారీగా రూ.37, 62,900 ఆన్‌లైన్‌లోనే చెల్లించారు.

చివరకు అనుమానం వచ్చి అతడిని గట్టిగా అడగడంతో కిడ్నీ ఇవ్వకనే రూ.కోటి ఓ వ్యక్తి ద్వారా పంపుతామని చెప్పారు. ఆ మేరకు ఇటీవల ఒకతను కవిత ఇంటికి వచ్చి తాను డెస్మండ్‌ ఓఈబోనని, తన వద్దనున్న సూట్‌కేసులో కోటి రూపాయల మేర రూ.2వేల నల్లనోట్లు ఉన్నాయని చెప్పి ఇచ్చాడు. కెమికల్‌ వాడితే ఆ నల్లనోట్లు అసలైన రూ.2వేల నోట్లుగా మారతాయని చెప్పి తన జిమ్మిక్కుతో ఓ మూడు నోట్లను అలా మార్చి నట్లు చూపి నమ్మించాడు. ఈ కెమికల్‌ బాటిల్‌ కావాలంటే రూ.15.50 లక్షలు అవుతుందన్నాడు. దీంతో వారు బెంగళూరుకెళ్లి అతని చేతికి రూ.11.50 లక్షలు అందజేసి ఆ బాటిల్‌ తెచ్చుకున్నారు. ఇంటికొచ్చే లోపు అది పగిలిపోయింది. మరో కెమికల్‌ బాటిల్‌ కావాలంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలని అతను డిమాండ్‌ చేశాడు. వీళ్లు అంగీకరించడంతో సెప్టెంబర్‌ 23న తానే స్వయంగా కెమికల్‌ బాటిల్‌ తీసుకొస్తానని నమ్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ నల్లనోట్లను బాగా పరిశీలించి అవి కేవలం నల్ల కాగి తాలేనని, తాము మోసపోయామని తెలు సుకున్నారు. ఈనెల 17న రాప్తాడు పోలీ సులను ఆశ్రయించారు.

చెప్పినట్లే వచ్చిన నైజీరియన్‌వాసిని ఇటుకలపల్లి ఇన్‌చార్జ్‌ సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐ ధరణీబాబు తదితరులు రేణుకా గేటెడ్‌ టౌన్‌షిప్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. విచారించగా డాక్టర్‌ అమర్‌పేరున ఇచ్చిన ప్రకటన తనదేనని అంగీకరించాడు. నైజీరియాకు చెందిన తాను 2014 నవంబర్‌ 11న స్టూడెంట్‌ వీసా కింద ఏడాది అనుమతితో బెంగుళూరుకు వచ్చానని చెప్పాడు. అయితే వీసా గడువు ముగిసినా అనధికారికంగా బెంగూళురులోనే ఉంటూ ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడాలని పథకం రచించినట్లు అంగీకరించాడు. అందులో భాగంగా కవిత, మారుతిలను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top