‘మెట్రో ఇండియా’ ఆంగ్ల పత్రిక ఆవిష్కరణ | 'Metro India' Launch of the English magazine | Sakshi
Sakshi News home page

‘మెట్రో ఇండియా’ ఆంగ్ల పత్రిక ఆవిష్కరణ

Sep 1 2013 4:09 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ప్రచురితమయ్యే‘మెట్రో ఇండియా’ ఆంగ్ల దినపత్రికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు.

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ప్రచురితమయ్యే‘మెట్రో ఇండియా’ ఆంగ్ల దినపత్రికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పత్రికావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు ‘మెట్రో ఇండియా’ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తూ పత్రికలకు విశ్వసనీయత ఉండాలని అన్నారు. పత్రికలు విలువలకు పెద్దపీట వేస్తూ జాతిని ముందుకు నడిపించాలని ఆకాంక్షిం చారు. ప్రస్తుతం దేశంలో మీడియా సత్యాల కంటే సంచలనాలకే అధిక ప్రాధాన్యమిస్తోందని, ఇది దేశ ప్రగతి ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదని  బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఈ పత్రిక దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో వెలువడుతుందని పత్రిక సీఎండీ సీఎల్ రాజం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంఐఎం పార్టీ నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు,  టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, సీఎల్ రాజం సతీమణి విజయ రాజం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement