రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత


రాజమండ్రి : కర్ణాటక రాష్ట్రానికి గంజాయి తరలిస్తున్న ముఠాను తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి, రూ.30 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ జిల్లా ఎస్పీ ఎస్.హరికృష్ణకు అందిన సమాచారం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం రూరల్ గామన్ ఇండియా బ్రిడ్జి వద్ద గంజాయి లారీని, జీపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలలోని 30 బస్తాలు, జీపులో 10 బస్తాల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి కర్నాటక రాష్ట్రానికి తరలిస్తుండగా రాజమహేంద్రవరం యూంటీ గూండా స్క్వాడ్ ఎస్సై వెంకటేశ్వరరావు, త్రీటౌన్ పోలీసులు దాడి చేసి లారీని, జీపును స్వాధీనం చేసుకున్నారు.



ఈ దాడిలో అనంతపురం జిల్లా షిర్డీనగర్ రెవెన్యూ కాలనీకి చెందిన ఆకుల ఆయ్యపు రెడ్డిని, కడప జిల్లా ముద్దనూరు చినదుద్యాలకు చెందిన భోరెడ్డి వెంకట మదన్‌మోహన్‌ రెడ్డిని, కడప జిల్లా మైదుకూరుకు చెందిన చీమల జనక మునేంద్ర రెడ్డిని, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఐ.పంగిడికి చెందిన చదలవాడ అనిల్‌ను, పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ధారవరం గ్రామానికి చెందిన గాలంకి సత్యనారాయణ అలియాస్ అన్నవరంలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.70 వేల నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన రాంబాబు, గరడయ్యలు ఇక్కడి నుంచి కడప జిల్లాకు, అక్కడి నుంచి సత్యారెడ్డి ద్వారా కర్ణాటక రాష్ట్రానికి తరలించడానికి పథకం రచించారు. ఈ ముఠా వెనుక ఉన్న కీలక నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ శ్రీరామకోటేశ్వరరావు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top