సత్యదేవుని ఆలయంలో లిఫ్ట్ ఏర్పాటు | Lift arrangement in annavaram temple | Sakshi
Sakshi News home page

సత్యదేవుని ఆలయంలో లిఫ్ట్ ఏర్పాటు

Aug 13 2013 5:41 AM | Updated on Sep 1 2017 9:49 PM

సత్యదేవుని ఆలయానికి వచ్చే వయోవృద్దులు, వికలాంగులకు శుభవార్త. స్వామివారి ఆలయానికి వారు సులభంగా చేరుకునేందుకు వీలుగా దేవస్థానం నిర్మిస్తున్న లిఫ్ట్ పనులు మరో పది రోజుల్లో పూర్తికానున్నాయి.

అన్నవరం: సత్యదేవుని ఆలయానికి వచ్చే వయోవృద్దులు, వికలాంగులకు శుభవార్త. స్వామివారి ఆలయానికి వారు సులభంగా చేరుకునేందుకు వీలుగా దేవస్థానం నిర్మిస్తున్న లిఫ్ట్ పనులు మరో పది రోజుల్లో పూర్తికానున్నాయి. ఇప్పటికే లిఫ్ట్ సివిల్ పనులు పూర్తికాగా, మిషనరీ బిగింపు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. సత్యదేవుని ఆలయానికి వచ్చే వయోవృద్ధులు, వికలాంగులు రాజగోపురం వద్దనుంచి సుమారు వంద మెట్లు ఎక్కితే తప్ప స్వామివారి ఆలయానికి చేరలేరు. దీంతో వారిని వీల్ ఛైర్‌లో కూర్చోబెట్టి మోసుకుంటూ ఆలయానికి తీసుకువెళుతుంటారు.
 
ఇది కూడా ఇబ్బందిగా భావించే వారు రాజగోపురం వద్దనే ఆగిపోయి అక్కడి నుంచే స్వామివారికి నమస్కరించి వె నుతిరుగుతారు. లిఫ్ట్ నిర్మిస్తే వారికి ఉపయోగరంగా ఉంటుందనితలచిన దేవస్థానం అధికారులు 2012 నవంబర్‌లో రూ. 14.85 లక్షలతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో రూ.8 లక్షలు మిషనరీ బిగింపునకు మిగతా రూ.6.85 లక్షలు సివిల్ పనులకు కేటాయించారు. స్వామివారి ఆలయానికి వెనుకవైపున వ్రత మంటపాన్ని చేర్చి ఈ లిఫ్ట్ నిర్మిస్తున్నారు. 40 అడుగుల ఎత్తున, మూడు అంతస్తుల్లో ఆగేలా  దీనిని నిర్మిస్తున్నారు.
 
తొలి అంతస్తులో వ్రత మండపాలకు, రెండో అంతస్తులో స్వామివారి ప్రధానాలయం వెనుక వైపునకు, మూడో అంతస్తులో ఆలయ శిఖ రానికి (ఇది దేవస్థానం సిబ్బంది, సెక్యూరిటీ వారికి మాత్రమే పరిమితం) వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. మిషనరీ బిగింపు పనులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. పనులు పూర్తయిన వెంటనే లిఫ్ట్‌ను ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని దేవస్థానం ఈఓ పి. వేంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. లిఫ్ట్ వరకూ భక్తులు చేరుకునేందుకు వీల్ ఛైర్లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement