
భన్వర్లాల్కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, శ్రీనివాసులు, రాజన్నదొర, బుగ్గన
కర్నూలు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు అంతే లేకుండా పోయిందని...
* కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలపై వెఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
* టీడీపీ నీచాతినీచానికి దిగజారింది
* అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కర్నూలు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు అంతే లేకుండా పోయిందని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తమకు ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ వెళుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.
వైఎస్సార్సీపీకి 80 మంది సభ్యులు అధికంగా ఉన్నా.. టీడీపీ పోటీకి దిగి ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కిడ్నాప్ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పీడిక రాజన్నదొర శనివారం సచివాలయంలో రెండురాష్ట్రాల ఉమ్మడి ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ను కలసి టీడీపీ అక్రమాలపై ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం సమర్పించారు.
అనంతరం వారు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తమపార్టీ సభ్యులు కూడా తమకు ఓటేస్తారో లేదోనన్న భయం టీడీపీలో మొదలైందని, దీంతో చాలామంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు చదువురాదనే సాకు చూపి సహాయకులతో ఓట్లు వేయించడానికి పూనుకుందని ఎమ్మెల్యేలు తెలిపారు.దీనిపై చర్యలు తీసుకుని సహాయకులను అనుమతించరాదని ఈసీకి విన్నవించామని తెలిపారు. ప్యాపిలి, డోన్ ఎంపీటీసీలను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని, కేసులు పెట్టినా పోలీసులు తీసుకోవట్లేదని వారు చెప్పారు.
ప్రజలకోసం ముందుండే పార్టీ మాదే..
ఓటుకు కోట్లు కేసులో పూర్తిగా కూరుకుపోయిన చంద్రబాబు దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సెక్షన్8ను లేవనెత్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. రాష్ట్రప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా ముందుండి పోరాడుతున్నది వైఎస్సార్సీపీయేనని ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు.