పెరిగిపోతున్నారు.. పెళ్లికాని ప్రసాద్‌లు

Increase Unmarried People In AP - Sakshi

అమ్మాయిల కొరతతో అవస్థలు 

చదువు, ఉద్యోగం ఉంటేనే ప్రాధాన్యం

 కుమారుల పెళ్లిపై తల్లిదండ్రుల బెంగ

 వయసు మీరుతోందని ఆందోళన

నిడదవోలు : పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారిని ప్రయోజకులను చేయడం వరకు బాగానే ఉన్నా.. వారికి వివాహం చేసే విషయంలో మాత్రం తల్లిదండ్రులు  అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కుమారుల వివాహ విషయంలోనే ఎక్కువగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొడుకు పుట్టాలని తమ ఇష్ట దైవాలను పూజించడం, మొక్కులు చెల్లించడం వంటివి కొందరు తల్లిదండ్రులు చేస్తారు. కొడుకు పెరిగి పెద్దవాడైన తరువాత అతని పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేయడానికి ప్రస్తుతం తల్లిదండ్రులు వేయి దేవుళ్లకు మొక్కుతున్నారు. జీవితాంతం పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేసిన తరువాత పెళ్లి చేస్తే ఓ పనైపోతుందనుకుంటే సంబంధాలు అంత తేలిగ్గా కుదరడం లేదు. యువకుల సంఖ్యకు తగ్గట్టు యువ తులు లేకపోవడం, ఉద్యోగం వచ్చి స్థిరపడే వరకు పెళ్లి ప్రస్తావన చేయకపోవడం, అబ్బాయిల విషయంలో అమ్మాయిలు రాజీ పడకపోవడం, అమ్మాయిలు కోరుకున్నట్లు యువకులు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య పెరుగుతోంది. 

అమ్మాయిల అభిప్రాయానికే ప్రాధాన్యత
గతంలో కుటుంబానికి పెద్ద దిక్కయిన తండ్రి ఎంత చెబితే అంతలా ఉండేది. అమ్మాయిలకు పెళ్లి సంబంధాలలో కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు ఏ సంబంధం చూసినా పిల్లలు అభ్యంతరం చెప్పేవారు కాదు. అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే పెళ్లి ముహూర్తం ఖరారు చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అమ్మాయి ఓకే అంటేనే పెళ్లి చూపులు. అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే పెళ్లి. అంటే ప్రాధాన్యత అమ్మాయికే ఎక్కువగా ఉంటోంది.  అబ్బాయి ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్‌ కోర్సు చేసి ఉండాలని.. ఉద్యోగం కూడా చేస్తూ ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మంచి ఉద్యోగంలో స్థిరపడిన తరువాత వివాహం చేసుకోవాలనే సంకల్పం కారణంగా అబ్బాయిల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. 

ఉన్నత చదువులు.. పెరుగుతున్న పెళ్లి వయస్సు
మానవుని జీవిత చక్రంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత చదువుల ఆవశ్యకత ఎంతో ఉంది. చదువులు, ఉద్యోగాలు, జీవిత భద్రత అంటూ.. యువతీ, యువకులు సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం లేదు. యువతులకు 23 నుంచి 25 ఏళ్లు, యువకులకు 28 నుంచి 30 ఏళ్ల తర్వాతనే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. డిగ్రీ చదివితే కనీసం ప్రైవేట్‌ ఉద్యోగం అయినా వస్తుందనుకుంటే నేటి రోజుల్లో ప్రైవేట్‌ ఉద్యోగాలు కూడా ఉన్నత చదువులు ఉంటేనే వస్తున్నాయి. ఆ చదువులు పూర్తయ్యే సరికి పెళ్లి వయస్సు మించిపోతుంది. 

గతంలో ఉన్నత చదువులైన మెడిసిన్, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంసీఏ, సీఏ వంటి కోర్సులు కేవలం కొన్ని వర్గాలకు చెందిన వారు మాత్రమే చదివేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. వీరిలో అమ్మాయిలే అధికంగా కనిపిస్తున్నారు. దీంతో అమ్మాయిల చదువు పూర్తయిన తర్వాతనే మంచి ఉద్యోగం ఉన్న యువకుడితో పెళ్లికి ఒప్పుకుంటున్నారు. చాలా మంది మధ్యతరగతి అమ్మాయిలు కూడా టీచర్‌ ఉద్యోగానికి ఆసక్తి చూపుతున్నారు. చేసుకోబోయే యువకుడు కూడా బీఈడీ చేసినట్లయితే వాళ్లిద్దరూ ప్రైవేట్‌ స్కూల్స్‌లో చిన్న ఉద్యోగం చేస్తూ జీవించవచ్చుననే భావనతో అమ్మాయిలు బీఈడీ వరుడు కోసం ఎదురు చూస్తున్నారు. అబ్బాయిలు కూడా టీచర్‌ ఉద్యోగం చేస్తున్నా కనీసం చేసుకోబోయే అమ్మాయికి బీఈడీ ఉండాలని కోరుకుంటున్నారు. 

వివక్షను విడనాడాలి
పూర్వ కాలంలో తల్లిదండ్రులు సంతానం విషయంలో ఆడైనా మగైనా దేవుడు వరంగా ఇచ్చిన బిడ్డలుగా భావించేవారు. తరువాత కుటుంబ నియంత్రణ అమలులోకి రావడంతో ఆర్థిక స్థోమతును కూడా దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లేక ముగ్గురితో ఎక్కువ సంతానానికి ముగింపు పలికారు. ఆ తరువాత కాలంలో (రెండు దశాబ్దాల క్రితం) ఆడపిల్లలు పుడితే వారిని చదివించడం, సంరక్షించడం, పెళ్లి చేయడం వంటివి భారంగా భావించేవారు. అదే అబ్బాయిలు అయితే ఎంత ఖర్చయినా ఉన్నత చదువులు చదివిస్తే ఉద్యోగం చేసి కుటుంబానికి ఆర్థికంగా సహకరిస్తాడని, అదే విధంగా వివాహం చేస్తే వచ్చే కోడలు తెచ్చే కట్న కానుకలతో కుటుంబం ఆర్థికంగా బలపడుతుందనే ఉద్దేశంతో మగ బిడ్డే కావాలని కోరుకున్నారు. మొదటి కాన్పులో అమ్మాయి పుడితే రెండవ కాన్పులో అబ్బాయి కోసం ఎదురు చూసేవారు.

 అదేవిధంగా మొదటి కాన్పులో అబ్బాయి పుడితే రెండవ కాన్పులో అమ్మాయి పుడుతుందనే భావంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించునేవారు. దీంతో ఎక్కడి పడితే అక్కడ చట్ట విరుద్ధమైన గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించేవారు. ఆడ బిడ్డయితే భ్రూణ హత్యలకు పాల్ప డేవారు. నేడు యువతీ యువకుల నిష్పత్తిలో తేడాలు పెరగడానికి ఇదో కారణం. ప్రతి వెయ్యి మంది పురుషులకు 980 మంది మహిళలు మాత్రమే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి సమానంగా ఉంటేనే అబ్బాయిలకు సకాలంలో వివాహాలు జరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రేక్షక పాత్రలో ప్రభుత్వం 
లింగ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలి. స్కానింగ్‌ సెంటర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అబ్బాయిల నిష్పత్తి ఎక్కువగా ఉండి అమ్మాయిల నిష్పత్తి తక్కువగా ఉండటంతో భవిష్యత్‌లో ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య జనాభా నిష్పత్తి సమానంగా ఉంటేనే వివాహాలు ఆలస్యం కాకుండా జరుగుతాయి. 
– టీఎన్‌వీ సూర్యప్రకాష్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, నిడదవోలు

ఆడపిల్లలను తక్కువ చేసి చూడొద్దు
తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో తక్కువ చేసి చూడొద్దు. ఆడ పిల్లల విషయంలో వివక్ష కొనసాగితే భవిష్యత్‌లో పూర్వ రోజులు కన్యాశుల్కం వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సమాజంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. కనుక ఆడ పిల్లలను తక్కువగా చూడకుండా మగ బిడ్డలతో పాటు సమానంగా చూడాలి. 
– కొండా నిర్మల, సీనియర్‌ సిటిజన్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నిడదవోలు 

స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి 
ప్రస్తుత సమాజంలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్‌ సెంటర్లపై ప్రభుత్వం నిషేధం విధించినా రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో మగ బిడ్డ పుడితే వంశోధ్ధారకుడని, ఆడ బిడ్డ పుడితే మరో ఇంటికి వెళ్ళాల్సి వస్తుందని పెద్దలు, భర్త ఒత్తిడితో ఆలోచన లేకుండా ఆడ పిల్లలను వద్దనుకోవడంతో అమ్మాయిల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే మహిళా చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. సమాజంలో ఆడ పిల్లల ప్రాధాన్యత, వారికి న్యాయస్థానాలు కల్పిస్తున్న హక్కులు, చట్టాలపై భవిష్యత్‌లో అవగాహన సదస్సులు చేపడతాం. 
– కారింకి సాయిబాబు, రోటరీక్లబ్‌ అధ్యక్షులు, నిడదవోలు  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top