
నష్టాల సునామీ!
అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న వెనామీ రొయ్యల సాగు కాసులు కురిపిస్తుందనుకున్న రైతన్నలను నష్టాల సునామీలోకి నెడుతోంది.
- వెనామీ రొయ్యలను చట్టుముడుతున్న వైట్స్పాట్ వ్యాధి
- భారీగా మృత్యువాత పడుతున్న రొయ్యలు
- వారం రోజుల్లో రూ. 45కోట్ల నష్టం
- ఆందోళనలో రైతులు
అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న వెనామీ రొయ్యల సాగు కాసులు కురిపిస్తుందనుకున్న రైతన్నలను నష్టాల సునామీలోకి నెడుతోంది. వైట్స్పాట్, విబ్రియో బ్యాక్టీరియాలు సోకి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. గత వారం రోజుల్లోనే జిల్లాలో రూ.45కోట్ల విలువైన వెనామీ రొయ్యలు చనిపోయాయి. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆందోళన చెందుతున్నారు.
కైకలూరు : ఆక్వా రైతులకు అక్షయపాత్రగా పేరుగడించిన వెనామీ రొయ్యలను వ్యాధులు చుట్టుముట్టాయి. నోటిదాక వచ్చిన పంట నేలపాలవుతోంది. వైట్స్పాట్, విబ్రియో బ్యాక్టీరియాల కారణంగా వారం రోజుల వ్యవధిలో సుమారు జిల్లా వ్యాప్తంగా రూ.45 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రైతన్నలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతున్నారు. ఇటీవల వరకు టైగర్ రొయ్యలకు వ్యాధుల కారణంగా తీవ్రనష్టాలను చవిచూసిన రైతులు కొద్దికాలంగా జన్యుపరంగా అభివృద్ధి చేసిన వెనామీ రొయ్యల సాగుపై దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల ఎకరాల్లో వెనామీ సాగు జరుగుతోంది. కృష్ణా జిల్లాల్లోనే 20 వేల ఎకారల్లో సాగు చేస్తున్నారు.
అంతర్జాతీయంగా మంచి డిమాండ్
వియత్నాం, చైనా, మలేసియా, థాయ్లాండ్ తదితర దేశాల్లో వెనామీ రొయ్యలకు ఎర్లీ మెర్టాలిటీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకడంతో పంట విరామం ప్రకటించారు. దీంతో భారత్లో సాగుచేసిన వెనామీ రొయ్యలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. మన దేశ మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.30,213,26 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ మొత్తంలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే కావడం విశేషం. ఇంత ఎక్కువ ఆదాయం పెరగడానికి వెనామీ రొయ్యల సాగే ప్రధాన కారణమని భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) గుర్తించింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం, విఫరితమైన లాభాలు రావడంతో కొస్తా ప్రాంతలో వెనామీ సాగు విస్తీర్ణం పెరిగింది. సరైన యాజమన్య పద్ధతులు పాటించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.
వారం రోజుల్లో రూ.45కోట్ల నష్టం
కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, కోనవారిపాలెం, బంటుమిల్లి ప్రాంతాల్లో వెనామీ సాగు చేస్తున్నారు. ఇటీవల ముదినేపల్లి మండలం పెదగొన్నూరు, సింగరాయపాలెం, కలిదిండి మండలం కోరుకొల్లు, కైకలూరు మండలం తామరకొల్లు తదితర గ్రామాల్లో వ్యాధుల కారణంగా వెనామీ రొయ్యలు మృత్యువాత పడ్డాయి. వెనామీ రొయ్యల చెరువుల్లో వైట్స్పాట్, విబ్రియో బ్యాక్టీరియా కారణంగా వారం రోజుల వ్యవధిలో సుమారు జిల్లా వ్యాప్తంగా రూ.45 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. పెరిగిన ముడిసరుకుల ధరలు కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
గతంలో ఎకరం రొయ్యల సాగులో మేత, డీజిల్, మందులు, లీజు, పిల్ల కొనుగోలు కలిపి రూ.8లక్షలు అవసరయ్యేది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.14 లక్షలకు చేరింది. ఉత్పత్తి పెరగడంతో రేటు తగ్గుతోంది. ప్రస్తుతం మార్కెట్లో 30 కౌంట్ రూ.530, 40 కౌంట్ రూ.420కి చేరింది. వ్యాధుల బారిన పడిన రొయ్యలను ఇతర దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే..
రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆక్వా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎకరం విస్తీర్ణం కలిగిన చెరువులో లక్ష టైగర్ రొయ్య పిల్లలను సాగు చేయవచ్చని, ఇదే విస్తీర్ణంలో వెనామీ పిల్లలను 6 లక్షలు వరకు సాగు చేయవచ్చు. రైతులు ఈ మోతాదుకు మించి పెంచుతున్నట్లు తెలుస్తోంది. బయోసెక్యూరిటీ విధానాలను కూడా పాటించకపోవడంతో ఒక చెరువు నుంచి మరో చెరువుకు వ్యాధులు ప్రబలుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వెనామీ సాగు చెరువులో పీతలు, ఎగిరే పక్షుల విడిచే పదర్థాల కారణంగానూ ఎక్కువగా వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు.
ఇతర చెరువుల నుంచి విడిచిపెట్టిన నీరు మరో చెరువులోకి తోడటం వల్ల కూడా రొయ్యలకు వ్యాధులు సోకుతున్నట్లు నిర్ధారించారు. ప్రభుత్వం కేటాయించిన హేచరీల వద్ద కాకుండా ప్రైవేటు వ్యక్తుల వద్ద నాణ్యతలేని రొయ్య పిల్లల సీడ్ కొనుగోలు చేయడం కూడా ఈ పరిస్థితికి కారణమని అధికారులు చెబుతున్నారు.
ముందుగానే గుర్తించవచ్చు
వెనామీ రొయ్యల్లో వైట్స్పాట్, విబ్రియో బ్యాక్టీరియా వ్యాధులు ఎక్కువగా వచ్చినట్లు గుర్తించాం. కైకలూరు మత్స్య శాఖ లేబోరేటరీలో వైట్స్పాట్ను పిల్ల దశలోనే గుర్తించే పొలిమరైజ్డ్ చైన్ రియాక్టర్(పీసీఆర్) మిషన్ అందుబాటులో ఉంది. ప్రధానంగా రైతులు నాణ్యతలేని సీడ్ను బయట వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి నష్టపోతున్నారు. అధికారుల సూచనలతో సాగు చేయడం ఉత్తమం.
- పి.సురేష్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు
నాష్టాలు తప్పడంలేదు
అప్పులు చేసి వెనామీ రొయ్యల సాగు చేపట్టాను. వ్యాధుల కారణంగా రొయ్యలు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వం రొయ్యల రైతులను ఆదుకోవాలి. రొయ్యల చెరువులకు లెసైన్సుల మంజూరును ఎంపెడా అధికారులు మరింత సులభతరం చేయాలి. రొయ్యల సీడ్ కోసం ఇతర ప్రాంతాలు వెళ్లడం వల్ల ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి మోసపోతున్నాం. సాగుపై రైతులకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలి.
- బి.రామకృష్ణ, రొయ్యల రైతు, పెదలంక