హత్యా రాజకీయం

Faction Politics in Andhra Pradesh - Sakshi

నాలుగున్నరేళ్లలో ఐదుగురు కీలక నేతలు హత్య

కదిరిలో విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనా దాడి

‘అనంత’ ఆస్పత్రిలో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై హత్యాయత్నం

తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో దారుణ పరిస్థితులు

జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం నేపథ్యంలో చర్చనీయాంశం

తీవ్రంగా ఖండిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈ క్రమంలో ‘అనంత’లో గత నాలుగున్నరేళ్ల పాలనను నిశితంగా పరిశీలిస్తే పూర్తిగా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. కీలక నేతల హత్యలు, భౌతిక దాడులతో ప్రతిపక్షపార్టీ నేతలను భయబ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించింది. 2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు హత్య రాజకీయాలకు తెరతీశారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా జరిగిన వరుస హత్యలను నిలువరించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. రాప్తాడు మాజీ మండల కన్వీనర్‌ ప్రసాద్‌రెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. పట్టపగలు రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయంలోని ఆర్‌ఐ చాంబర్‌లో వేటకొడవళ్లతో కిరాతకంగా నరికి చంపారు. ఈ మండలంలో పట్టుసాధించేందుకు మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం కనుసన్నల్లోనే హత్య జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

సింగిల్‌ విండో కార్యాలయంలోమరో హత్య
కిష్టిపాడు సింగిల్‌ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిది మరో కిరాతక హత్య. సింగిల్‌ విండో సమావేశం ఉందని, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వచ్చారని పిలిపించికార్యాలయంలోనే రాడ్లు, రాళ్లు, కట్టెలతో నరికి చంపారు. పెద్దవడుగూరు మండలంలో విజయభాస్కర్‌రెడ్డికి మంచి పట్టుం ది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే మెజార్టీ వచ్చింది. ఇక్కడ బలపడేందుకు జేసీ సోదరులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో భాస్కర్‌రెడ్డి హత్య జరగడంతో జేసీ బ్రదర్స్‌ అండతోనే జరిగిందని అప్పట్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపించారు.

శింగనమల, రాయదుర్గం నియోజకవర్గాల్లోనూ హత్యలు: 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే యల్లనూరులో వైఎస్‌ఆర్‌సీపీ నేత ప్రకాశం శెట్టిని జూలై 3న హత్య చేశారు. ప్రభుత్వం వచ్చాక జరిగిన తొలి హత్య ఇది. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నెలరోజులు గడవక ముందే ఇదే నియోజకవర్గంలోని ఎల్లుట్లలో మల్లిఖార్జున అనే మరో నేతను మట్టుబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపునకు మల్లిఖార్జున పనిచేశారు. దీంతోనే అతన్ని హత్యచేశారు. ఈ రెండుహత్యలు జరిగిన నెల రోజులకు మరో హత్య జరిగింది. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్‌కు చెందిన విశ్వనాథ్‌ను అంతమొందించారు. ఇలా తెలుగుదేశం పార్టీ అధికా>రంలోకి వచ్చాక జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేలా అధికారపార్టీ నేతలు వరుస ఘటనలకు పాల్పడ్డారు. యల్లనూరు తదితర ప్రాంతాల్లో జేసీ అనుచరులు వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులను ఆర్థికంగా దెబ్బతీసే ధ్యేయంతో వారి తోటలను ధ్వంసం చేశారు. రాప్తాడు తదితర ప్రాంతాల్లో అప్పటి వరకూ ఉన్న స్టోరు డీలర్లను బలవంతంగా తొలగించడం, గ్రామాల్లో చిన్న చిన్న విషయాలపై గొడవ పెట్టుకుని వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, దాడి చేసిన వారే చిన్న చిన్న గీరుడు గాయలతో ఆస్పత్రిలో చేరి కౌంటర్‌ కేసులు పెట్టడం తరచుగా జరుగుతోంది.

జగన్‌మోహన్‌రెడ్డిపైనా దాడి..
రైతు భరోసా యాత్రలో భాగంగా కదిరి పట్టణంలో జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగసభ నిర్వహించారు. సభ అనంతరం ర్యాలీగా వస్తున్న జగన్‌ వాహనంపై మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ అనుచరులు చెప్పులు, రాళ్లు, వాటర్‌ బాటిళ్లలో ఇసుక వేసి దాడి చేశారు. ఆ దాడిలో జగన్‌ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరిగేంత వరకూ జిల్లాలో పోలీసులు జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై దృష్టి సారించలేదు. రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై అనంతపురం సర్వజనాస్పత్రిలో హత్యాయత్నం జరిగింది. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ప్రకాశ్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఇదే అదనుగా టీడీపీ నేతలు ప్రకాశ్‌పై దాడికి యత్నించారు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఓ గదిలో ప్రకాశ్‌ను దాచారు. అప్పటి డీజీపీ జేవీ రాముడు అనంతపురంలో ఉండగనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా దాడులు            
నాలుగున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా టీడీపీ నేతలు దాడులకు తెగించారు. 2017 నవంబర్‌లో గొందిరెడ్డిలో సర్పంచు కుమారుడు బాబయ్యపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు.
2017 నవంబర్‌ 12న రామగిరి మండలం పేరూరులో వైఎస్సార్‌సీపీ నేత సుబ్బుకష్ణ దంపతులపై దాడి చేశారు. స్కూటర్‌కు వైఎస్సార్‌సీపీ జెండా ఉందనే కారణంతో ఈ దాడికి తెగించారు.
ధర్మవరం నియోజకవర్గంలోని కొండగట్టుపల్లిలో చిన్నికృష్ణ అనే రైతుకు చెందిన 350 చీనీ చెట్లు నరికేశారు. కేవలం ఇతను కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరుడనే కక్షతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ధరవ్మరంలోని కేతిరెడ్డి కాలనీలో 112 నెంబర్‌ రేషన్‌షాపు యజమాని శకుంతల భర్త నారాయణరెడ్డిపై భౌతికదాడి చేసి కిడ్నాప్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top